Bonda Uma: పవన్ కల్యాణ్ హత్యకు రూ.250 కోట్లతో స్కెచ్ వేశారు: బొండా ఉమ సంచలన వ్యాఖ్యలు

  • ఇప్పటం పరిణామాలపై బొండా ఉమ స్పందన
  • పవన్ కల్యాణ్ హత్యకు సుపారీ అంటూ వ్యాఖ్యలు
  • ప్రాణాలు తీయాలనే చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్లదాడి అని ఆరోపణ
Bond Uma press meet over Ippatam issue

ప్రతిపక్షాలకు సహకరించిన వారిపై దాడులు, కూల్చివేతలు, తప్పుడు కేసులు పెట్టడమే జగన్ రెడ్డి విధానం అని టీడీపీ సీనియర్ నేత బొండా ఉమ మండిపడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో కూల్చివేతలపై ఉమ మీడియా సమావేశంలో స్పందించారు. పవన్ కల్యాణ్ గారి బహిరంగ సభకు స్థలం ఇవ్వడమే ఇప్పటం గ్రామస్థులు చేసిన నేరమా? అని ప్రశ్నించారు. 

ప్రతి శుక్రవారం, శనివారం జేసీబీలకు జగన్ రెడ్డి పని కల్పిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష నేతలు, పార్టీ అధ్యక్షుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ హత్యకు రూ.250 కోట్లతో స్కెచ్ వేశారని ఆరోపణలు చేశారు. రెక్కీ కూడా చేశారని వెల్లడించారు. ఇందులో తాడేపల్లి హస్తం ఉందనే అనుమానాలు ఉన్నాయని అన్నారు. 

ప్రాణాలు తీయాలనే నందిగామ పర్యటనలో చంద్రబాబు గారి కాన్వాయ్ పై రాళ్ల దాడి చేశారని బొండా ఉమ వ్యాఖ్యానించారు. మిమ్మల్ని ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? అంటూ ప్రశ్నించారు. "నందిగామ పర్యటనలో చంద్రబాబు గారి కాన్వాయ్ పై స్థానిక ఎమ్మెల్యే, వారి తమ్ముడు ఎమ్మెల్సీ అరుణ్, వారి ముఖ్య అనుచరులు కుట్రపన్ని దాడికి పాల్పడ్డారు. అదృష్టవశాత్తు ఆయనకు ప్రాణాపాయం తప్పింది. ఆ రాయి సీఎస్ వోకు గడ్డంపై తగిలింది. అదే కంటిపై తగిలుంటే కన్నుపోయేది. ఇంకా 15 రాళ్ల వరకు విసిరారు. ఈ ప్రభుత్వం పథకం ప్రకారం ప్రతిపక్ష నేతలపై, పార్టీల అధ్యక్షులపై పథకం ప్రకారం ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. 

పిచ్చోడి చేతిలో రాయిలా జగన్ రెడ్డి పాలన ఉంది. విశాఖలో 40 వేల కోట్ల భూములను కబ్జా చేశారని ప్రశ్నించినందుకు అయ్యన్నపాత్రుడిని సీబీసీఐడీ పోలీసులు దండుపాళ్యం బ్యాచ్ లా వెళ్లి, గోడలు దూకి, ఆడవారిపై దౌర్జన్యం చేసి, కుమారుడు రాజేష్ ను కొట్టి అర్థరాత్రి అరెస్ట్ చేశారు. బాత్రూం అంత గోడకట్టారని అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేస్తే కోర్టులు ఏం తీర్పులు ఇచ్చాయో చూశాం. జగన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కడప జిల్లా కమలాపురంలో వక్ఫ్ భూముల్లో సినిమా హాళ్లు కడితే చర్యలు ఉండవు. నదులు పక్కన, చెరువులు పక్కన భూములు ఆక్రమించుకుని ఇళ్లు కడితే పట్టించుకోరు" అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

"ఇప్పటంలో రహదారి విస్తరణ కోసం అని చెబుతున్నారు... రాష్ట్రంలో రోడ్లపై గుంతలు పూడ్చడానికి ఒక్క తట్ట మట్టి వేశారా? టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు బూజు పట్టగా... నేడు ఉన్న ఇళ్లను కూల్చుతున్నారు. ఇప్పటంలో గాంధీ, నెహ్రూ విగ్రహాలను ధ్వంసం చేసి.. వైఎస్ విగ్రహానికి మాత్రం పోలీసులు కాపలా ఉండి కాపాడారు. 

చంద్రబాబు గారిపై హత్యాయత్నంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని ముద్దాయిలుగా చేర్చి విచారణ చేయాలి. అరుణ్ కుమార్ ముఖ్య అనుచరుడే నిన్నటి పర్యటనలో ఉన్నాడు. ఎందుకు వారు అక్కడ ఉన్నారు? పోలీసులు ఏం చేస్తున్నారు. వీటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పవన్ కల్యాణ్ హత్యకు రూ.250 కోట్లు సుపారీపైనా విచారణ జరగాలి. వచ్చే రోజుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజకీయ పార్టీలు, మేధావులు రోడ్లపైకి రావాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు టీడీపీ పిలుపునివ్వడం జరిగింది. చంద్రబాబు గారి నిర్ణయం మేరకు కలిసొచ్చే పార్టీలతో ముందుకు వెళతాం" అని బొండా ఉమ స్పష్టం చేశారు.

More Telugu News