Telangana: రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే కాబోతున్నారు... మునుగోడుతో బీఆర్ఎస్ ఖతం: బండి సంజయ్

  • మునుగోడు ఎన్నికలపై మీడియా సమావేశాన్ని నిర్వహించిన బండి సంజయ్
  • ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ధీమా
  • మునుగోడులో కేసీఆర్ రూ.1,000 కోట్లు ఖర్చు చేశారని ఆరోపణ
  • రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కేసీఆర్ జేబు మనిషిగా పనిచేశారని ధ్వజం
bandi sanjay comments on munugode bypolls

మునుగోడు ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే కాబోతున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా మునుగోడు ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ ఖతం అయినట్టేనని కూడా ఆయన అన్నారు. ఒక్క మునుగోడు ఉప ఎన్నిక కోసమే సీఎం కేసీఆర్ రూ.1,000 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఒక గ్రామంలో ఒక్కో ఓటుకు రూ.40 వేల నుంచి రూ.50 వేల దాకా ఇచ్చారని ఆయన ఆరోపించారు.


మునుగోడు ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచే టీఆర్ఎస్ తన మంత్రివర్గాన్ని అక్కడే తిష్ట వేయించిందని సంజయ్ ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కేసీఆర్ జేబు మనిషిగా పనిచేశారని కూడా ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ అక్రమాలపై పక్కా ఫిర్యాదులతో కంప్లెయింట్ చేసినా సీఈఓ పట్టించుకోలేదన్నారు. గులాబీ నేతలకు, ప్రగతి భవన్ కు పోలీస్ కమిషనర్, ఎస్పీలు గులాం గిరీ చేశారని ఆయన ఆరోపించారు.

More Telugu News