Prime Minister: అవినీతి పరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: ప్రధాని మోదీ

  • ఎంతటి శక్తిమంతులైనా సరే చర్యలకు వెనుకాడొద్దన్న ప్రధాని
  • ఈ విషయంలో భయపడకుండా దృఢంగా ఉండాలని సూచన
  • అవినీతి పరులు కీర్తింప బడడంపై విచారం
No matter how powerful PM Modi firm message on corruption

అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ప్రధాని మోదీ స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన విజిలెన్స్ వీక్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అవినీతి, అవినీతి పరులకు వ్యతిరేకంగా వ్యవహరించే విషయంలో ఏజెన్సీలు, అధికారులు భయపడాల్సిన అవసరం కానీ, రక్షణాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం కానీ లేవన్నారు. అవినీతి పరులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదన్నారు. అటువంటి వారికి రాజకీయ, సామాజిక రక్షణ కూడా లభించకూడదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

‘‘అవినీతి అన్నది ఓ దెయ్యం. దానికి దూరంగా ఉండాలి. గత ఎనిమిదేళ్ల నుంచి వ్యవస్థను మార్చేందుకు కృషి చేస్తున్నాం. చాలా సందర్భాల్లో అవినీతికి పాల్పడిన వారు, అభియోగాలు రుజువై జైలుకు వెళ్లొచ్చినా కానీ కీర్తింపబడుతున్నారు. భారత సమాజానికి ఇదేమీ మంచి పరిస్థితి కాదు. నేడు కూడా అవినీతిపరులను సమర్థిస్తూ కొందరు మాట్లాడుతున్నారు. సమాజం పట్ల వారికున్న బాధ్యత, కర్తవ్యాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

అవినీతి పరులు ఎంతటి శక్తిమంతులైనా, వారిపై చర్యలు తీసుకునే విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగిపోకుండా, దృఢంగా వ్యవహరించాలని దర్యాప్తు ఏజెన్సీలకు ప్రధాని సూచించారు. అవినీతి పరులు తప్పించుకోకుండా చూడాలని కోరారు.

More Telugu News