Telangana: ఆరు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్.. శాంతియుతంగా ఓటింగ్

  • దేశవ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో కొనసాగుతున్న పోలింగ్
  • ప్రతి చోట బీజేపీ, ప్రాంతీయ పార్టీల మధ్యే హోరాహోరీ
  • బీహార్, మహారాష్ట్రలో సమీకరణాలు మారిన తర్వాత జరుగుతున్న తొలి పోరు ఇదే
By Elections Polling continues in India

తెలంగాణ సహా ఆరు రాష్ట్రాల్లోని ఏడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తెలంగాణలోని మునుగోడు సహా అన్ని చోట్లా ప్రాంతీయ పార్టీలతో బీజేపీ హోరాహోరీగా తలపడుతోంది. మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ, టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో తొలి నుంచీ ఇరు పార్టీల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్‌గా మారి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్టు ప్రకటించిన టీఆర్ఎస్ ఈ ఎన్నిక ఫలితం ద్వారా తొలి అడుగు వేయాలని నిర్ణయించుకుంది. మరోవైపు, మునుగోడులో విజయం సాధించడం ద్వారా రానున్న అసెంబ్లీ ఎన్నికలపై పట్టు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇక, మిగతా రాష్ట్రాల విషయానికి వస్తే బీహార్‌లో బీజేపీతో నితీశ్ కుమార్ కటీఫ్ చెప్పి ఆర్జేడీతో చేతులు కలిపిన తర్వాత తొలిసారి ఇక్కడి మోకామా, గోపాల్ గంజ్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. హర్యానాలోని అదంపూర్‌లో ఉప ఎన్నిక జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ కుటుంబానికి ఇది కంచుకోట. భజన్‌లాల్ చిన్నకుమారుడు కుల్‌దీప్ బిష్ణోయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఇక ఎమ్మెల్యే అరవింద్ గిరి మరణంతో ఉత్తరప్రదేశ్‌లోని గోలా గోరఖ్‌నాథ్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుండగా, కాంగ్రెస్, బీఎస్పీ పోటీకి దూరమయ్యాయి. దీంతో ఎస్పీ, బీజేపీ మధ్య పోరు జరుగుతోంది. అలాగే, ఒడిశాలోని ధామ్‌నగర్‌కు, ముంబైలోని అంధేరి ఈస్ట్‌లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ శివసేనలో చీలిక తర్వాత జరుగుతున్న తొలి ఉప ఎన్నిక ఇదే.

More Telugu News