Devi Sri Prasad: ఆల్బమ్ సాంగ్ వివాదంలో దేవిశ్రీ ప్రసాద్... పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కల్యాణి, హిందూ సంఘాలు

  • 'ఓ పారి' అనే ఆల్బమ్ రూపొందించిన దేవి
  • 'హరే రామ హరే కృష్ణ' అంటూ ఓ సాంగ్
  • అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కరాటే కల్యాణి, హిందూ సంఘాలు
  • క్షమాపణ చెప్పాలని డిమాండ్
Controversy on Devi Sri Prasad album song

వివాదాలకు దూరంగా ఉండే టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అనూహ్యరీతిలో ఓ వివాదంలో చిక్కుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల 'ఓ పారి' (తెలుగులో ఓ పిల్లా) అనే ప్రైవేటు ఆల్బమ్ ను రూపొందించారు. 

ఇందులో 'హరే రామ హరే కృష్ణ' అనే పవిత్ర భజనను ఐటెం సాంగ్ గా మలిచారంటూ దేవిశ్రీ ప్రసాద్ పై ఆరోపణలు వచ్చాయి. పవిత్ర మంత్రాన్ని ఐటెం సాంగ్ గా చిత్రీకరించిన దేవిశ్రీ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలంటూ టాలీవుడ్ నటి కరాటే కల్యాణి, పలు హిందూ సంఘాల నేతలు హైదరాబాదు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ పాటతో హిందువుల మనోభావాలకు భంగం కలుగుతోందని, 'హరే రామ హరే కృష్ణ' అనే మంత్రాన్ని తొలగించాలని వారు పోలీసులను కోరారు. దీనిపై కరాటే కల్యాణి స్పందిస్తూ, దేవిశ్రీ ప్రసాద్ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆయన కార్యాలయాన్ని ముట్టడిస్తామని స్పష్టం చేశారు. 

ఈ వివాదంపై దేవిశ్రీ ప్రసాద్ ఇంకా స్పందించలేదు. ఈ పాటను మూడు వారాల కిందట యూట్యూబ్ లో పోస్టు చేయగా, ఇప్పటిదాకా 2.5 మిలియన్ల వ్యూస్ ను పొందడం విశేషం. ఈ పాటకు సంగీతం, సాహిత్యం, గాత్రం అన్నీ దేవిశ్రీ ప్రసాదే అందించారు.

More Telugu News