Pooja Hegde: టెన్షన్ పడుతున్న టాప్ హీరోయిన్స్!

  • మూడు ఫ్లాపులతో ఉన్న పూజ హెగ్డే 
  • ఆశలన్నీ మహేశ్ బాబు మూవీ పైనే 
  • 'సీతా రామం' హిట్ మృణాళ్ ఠాకూర్ ఖాతాలోకి 
  • నిరాశలో ఉన్న రష్మిక అభిమానులు 
  • 'దసరా'పైనే నమ్మకం పెట్టుకున్న కీర్తి సురేశ్    
Top Heroines Up Coming Movies

టాలీవుడ్ లో టాప్ త్రీ పొజీషన్లో ఉన్న హీరోయిన్లుగా పూజ హెగ్డే .. రష్మిక .. కీర్తి సురేశ్ పేర్లు చెబుతారు. కొంత కాలంగా ఈ ముగ్గురే ఇక్కడ చక్రం తిప్పుతూ తమ జోరును కొనసాగిస్తున్నారు. అయితే మొదటి స్థానంలో కొనసాగుతూ వచ్చిన పూజ హెగ్డే, వరుస ఫ్లాపులతో సతమతమవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన 'రాధేశ్యామ్' .. 'బీస్ట్' సినిమాలు, ఆ తరువాత వచ్చిన 'ఆచార్య' ఆమె గ్రాఫ్ ను కిందికి లాగేశాయి. దాంతో ఆమె అభిమానులంతా నిరాశతో ఉన్నారు. ఇక రష్మిక విషయానికొస్తే ఇటీవల వచ్చిన 'సీతా రామం' సూపర్ హిట్ అయినప్పటికీ, అందులో ఆమె హీరోయిన్ కాదు గనుక ఆ సక్సెస్ ఆమె ఖాతాలోకి రాలేదు. కథానాయికగా చేసిన మృణాల్ ఠాకూర్ గురించే అంతా మాట్లాడుకున్నారు. కీర్తి సురేశ్ వరుస ఫ్లాపుల తరువాత 'సర్కారువారి పాట' చేసింది. ఆ సినిమా ఆమెకి కాస్త ఊరట కలిగించినప్పటికీ, అది మహేశ్ బాబు స్థాయికి తగిన హిట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందువలన ఓ బలమైన హిట్ ఆమెకి అవసరమనే అభిప్రాయంలోనే అభిమానులు ఉన్నారు.  ప్రస్తుతం పూజ హెగ్డే చేస్తున్న హిందీ సినిమాలను పక్కన పెట్టేస్తే, తెలుగులో మాత్రం ఆమె ఒక సినిమాను మాత్రమే చేస్తోంది. త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్లోని ఈ సినిమా, షూటింగు దశలో ఉంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. రష్మిక నెక్స్ట్ మూవీగా విజయ్ సరసన ఆమె చేస్తున్న 'వరిసు' నిర్మితమవుతోంది. వంశీ పైడిపల్లి రూపొందిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఇక కీర్తి సురేశ్ విషయానికొస్తే, ఆమె తాజా చిత్రమైన 'దసరా' సెట్స్ పై ఉంది. నాని జోడీగా రెండోసారి ఆమె చేస్తున్న ఈ సినిమా, మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా ఈ ముగ్గురు హీరోయిన్స్ కూడా వచ్చే ఏడాదిలో రానున్న తమ సినిమాల హిట్ల పైనే నమ్మకం పెట్టుకున్నారు. టాప్ త్రీ రేసులో కొనసాగాలంటే ముగ్గురూ హిట్ కొట్టాల్సిందే.

More Telugu News