Puneeth Rajkumar: సింప్లిసిటీ అంటే ఇది కదా.. వైరల్ అవుతున్న ఎన్టీఆర్ వీడియో!

  • పునీత్ రాజ్‌కుమార్‌కు ‘కన్నడ రత్న’ అవార్డును ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం
  • రజనీకాంత్, ఎన్టీఆర్, సీఎం చేతుల మీదుగా ప్రదానం
  • కన్నడలో ప్రసంగించి పునీత్ అభిమానులను ఆకట్టుకున్న ఎన్టీఆర్
NTR Simplicity Video Viral on Social Media

‘కర్ణాటక రాజ్యోత్సవ’ వేడుకలకు హాజరైన ఎన్టీఆర్ సింప్లిసిటీకి కన్నడ అభిమానులు ఫిదా అయిపోయారు. వర్షం పడి కుర్చీలు తడిసిపోతే స్వయంగా వాటిని తుడిచి దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్వినిని కూర్చోబెట్టారు. ఆ తర్వాత తన కుర్చీని కూడా తుడుచుకుని కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలకు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, ఎన్టీఆర్, సుధామూర్తి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే, వర్షం పడడంతో సభలో అతిథుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు తడిసిపోయాయి. అది గమనించిన ఎన్టీఆర్ ఓ కుర్చీని బట్టతో తుడిచి పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్వినిని కూర్చోబెట్టారు. ఆ తర్వాత మరో కుర్చీలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధామూర్తిని కూర్చోమని చెప్పారు. అనంతరం తన కుర్చీని కూడా తానే క్లీన్ చేసుకుని కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

కాగా, పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘కర్ణాటక రత్న’ పురస్కారాన్ని నిన్న ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, రజనీకాంత్, ఎన్టీఆర్‌లు పునీత్ భార్య అశ్వినికి అందజేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కన్నడలో చేసిన ప్రసంగం అభిమానులతో కేరింతలు కొట్టించింది.

More Telugu News