Andhra Pradesh: సీఎం ఇంటి ముట్టడి నాటి కేసులను ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం

  • సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగుల ఉద్యమం
  • సెప్టెంబర్ 1న సీఎం ఇంటి ముట్టడికి ఉద్యోగుల యత్నం
  • ఉద్యోగులపై కేసులు నమోదు చేసిన పోలీసులు
  • తాజాగా కేసులన్నింటినీ ఉపసంహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
ap government withdraws cases on employees

సీపీఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు చేపట్టిన సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై నమోదు చేసిన కేసులను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు మంగళవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాము అధికారంలోకి వస్తే సీపీఎస్ ను రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత హోదాలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చినా సీపీఎస్ రద్దు కాలేదు. దీనిపై ఉద్యోగులు ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలో సెప్టెంబర్ 1న తాడేపల్లిలోని సీఎం ఇంటి ముట్టడికి ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే ఉద్యోగులను రానీయకుండా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. కొందరు ఉద్యోగులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ కేసుల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసింది. అందులో భాగంగానే కేసులను ఉపసంహరించుకుంటున్నట్లుగా మంగళవారం ప్రకటించింది.

More Telugu News