Telangana: సుప్రీంకోర్టును ఆశ్రయించిన 'ఎమ్మెల్యేల కొనుగోలు' కేసు నిందితులు

  • ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్టయిన రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్
  • బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 7కు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
  • తెలంగాణ హైకోర్టు తీర్పును రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో నిందితుల పిటిషన్
  • శుక్రవారం విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించిన సీజేఐ జస్టిస్ లలిత్ బెంచ్
trs mlas bribing case accused files petition in supreme court

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించారన్న ఆరోపణలపై అరెస్టయిన నిందితులు రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్ లు మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తమను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించిన నిందితులు... తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేయాలని తమ పిటిషన్ లో సుప్రీంకోర్టును కోరారు.

ఇటీవలే హైదరాబాద్ శివారు ప్రాంతం మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ వేదికగా నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతున్నారని ఆరోపిస్తూ సైబరాబాద్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరి రిమాండ్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించగా... పోలీసులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ప్రస్తుతం జైలులో వున్న నిందితులు తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ సోమవారమే ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా...దానిపై విచారణను కోర్టు ఈ నెల 7కు వాయిదా వేసింది.

ఈ క్రమంలో నిందితులు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు... ఈ నెల 4న దీనిపై విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పిటిషన్ మంగళవారం నేరుగా సీజేఐ జస్టిస్ లలిత్ ధర్మాసనం ముందుకు రాగా... ఆయనే శుక్రవారం నాటి కేసుల జాబితాలో ఈ పిటిషన్ ను చేర్చాలని ఆదేశాలు జారీ చేశారు.

More Telugu News