China: కరోనా ఆంక్షల భయంతో చైనాలో జనం బెంబేలు.. కంచెలు దూకి పారిపోయిన ‘ఫాక్స్‌కాన్’ సిబ్బంది.. వీడియో ఇదిగో!

  • చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా
  • పలు నగరాల్లో ఆంక్షలు 
  • కంపెనీలో 20 వేల మందికి వైరస్ సోకిందంటూ వార్తలు
  • కంచెలు దూకి కాలినడకనే స్వగ్రామాలకు వెళ్లిపోతున్న ఉద్యోగులు
Workers Escaping Lockdown At Chinas Largest iPhone Factory

చైనాలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. జీరో కొవిడ్ పాలసీని అనుసరిస్తున్న చైనా తాజాగా కేసులు వెలుగు చూసిన వెంటనే లాక్‌డౌన్‌తోపాటు కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే పలు నగరాల్లో ఆంక్షలు అమల్లో ఉన్నాయి. కరోనా కేసులు మళ్లీ వెలుగు చూస్తుండడంతో జనం భయాందోళనల మధ్య గడుపుతున్నారు. 

తాజాగా, జెంగ్ ఝౌ నగరంలోని ఐఫోన్లను అసెంబుల్ చేసే ఫ్యాక్టరీ ‘ఫాక్స్‌కాన్’లో పనిచేస్తున్న కార్మికుల్లో కొందరు కరోనా బారిన పడ్డట్టు వార్తలు రావడంతో భయపడిపోయిన మిగతా కార్మికులు, ఉద్యోగులు ఫ్యాక్టరీ గోడలు దూకి మరీ పారిపోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

కంపెనీ ఉద్యోగే ఒకరు వీటిని షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కంపెనీలో పనిచేస్తున్న పలువురు కరోనా బారినపడ్డారని, కంపెనీ వారిని క్వారంటైన్‌లో ఉంచినట్టు వార్తలు వచ్చాయి. అలాగే, ఉద్యోగుల కదలికలపైనా ఆంక్షలు విధించినట్టు చెబుతున్నారు. దీంతో ఆంక్షల బారి నుంచి తప్పించుకునేందుకు ఉద్యోగులు ఫ్యాక్టరీ కంచెలు దూకి పరారవుతున్నారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ స్వస్థలాలకు కాలినడకనే వెళ్తున్నారు. 

ఈ ఫాక్స్‌కాన్ కంపెనీలో 3.50 లక్షల మంది వరకు పనిచేసే వీలుంది. అయితే, ప్రస్తుతం ఎంతమంది ఉన్నారన్న విషయంలో స్పష్టత లేదు. దాదాపు 20 వేల మందికి వైరస్ సోకిందన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఫాక్స్‌కాన్ కొట్టిపడేసింది. ఉద్యోగులు కంచెలు దూకి బయటకు వెళ్తున్నట్టు వార్తలు రావడంతో స్పందించిన ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం వారి కోసం ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసింది.

More Telugu News