Bandi Sanjay: ఓడిపోతామని తెలిసినా కేసీఆర్ చండూరు సభలో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు: బండి సంజయ్

  • చండూరులో కేసీఆర్ సభ
  • బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు
  • స్పందించిన బండి సంజయ్
  • టోపీ పెట్టుకుని వచ్చాడని వెల్లడి
  • ప్రజల నెత్తిన టోపీ పెట్టి వెళ్లిపోయాడని వ్యాఖ్యలు
Bandi Sanjay slams CM KCR

మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో సీఎం కేసీఆర్ ప్రసంగంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. మర్రిగూడలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసినా, చండూరు సభలో కేసీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారని విమర్శించారు. టోపీ పెట్టుకుని వచ్చి మునుగోడు ప్రజల నెత్తిన టోపీ పెట్టి వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. 

మునుగోడు ఉప ఎన్నిక తర్వాత మీటర్ల పేరు చెప్పి కరెంటు చార్జీలు పెంచేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. మునుగోడు ప్రజలకు ఏంచేస్తారన్నది కేసీఆర్ చెప్పలేదని, ఒకవేళ గెలిచినా చేసేదేమీలేదని తన మాటలతో వెల్లడించారని తెలిపారు. 

'ఎమ్మెల్యేల కొనుగోలు' వ్యవహారంపైనా బండి సంజయ్ స్పందించారు. సర్కస్ లో జంతువుల్లా ఆ నలుగురు శాసనసభ్యులను హెలికాప్టర్ లో తీసుకొచ్చి తీసుకెళ్లారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తప్పేమీ చేయలేదని భావిస్తే సీఎం కేసీఆర్ ఎందుకు ప్రమాణం చేయడంలేదని ప్రశ్నించారు. సీబీఐ విచారణకు ఎందుకు భయం? అని అన్నారు. 

37 మంది శాసనసభ్యులను సంతలో పశువుల్లా కొన్నది కేసీఆర్ కాదా అని నిలదీశారు. ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలుపై మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు.

More Telugu News