Pakistan: ఎట్టకేలకు టీ20 వరల్డ్ కప్ లో తొలి విజయం నమోదు చేసిన పాకిస్థాన్

  • పెర్త్ లో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్
  • పాక్ ముందు 92 పరుగుల లక్ష్యం
  • 13.5 ఓవర్లలో ఛేదించిన పాక్
  • 49 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్
Pakistan registers first win in T20 World Cup by beating Nederlands

ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తొలి విజయం నమోదు చేసింది. సూపర్-12 దశ తొలి మ్యాచ్ లో టీమిండియా చేతిలో ఓడిపోయిన పాక్, రెండో మ్యాచ్ లో జింబాబ్వేపై దిగ్భ్రాంతికర రీతిలో పరాజయం చవిచూసింది. దాంతో, సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో నేడు పసికూన నెదర్లాండ్స్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

పెర్త్ లో నెదర్లాండ్స్ నిర్దేశించిన 92 పరుగుల విజయలక్ష్యాన్ని పాక్ కేవలం 13.5 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఛేదనలో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్ బాబర్ అజామ్ 4 పరుగులకే రనౌట్  కాగా, రిజ్వాన్ 39 బంతుల్లోనే 49 పరుగులు చేసి ఇన్నింగ్స్ నిలబెట్టాడు. 

ఫఖార్ జమాన్ 20, షాన్ మసూద్ 12 పరుగులు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బ్రాండన్ గ్లోవర్ 2, పాల్ వాన్ మీకెరెన్ 1 వికెట్ తీశారు.

More Telugu News