Bandi Sanjay: యాదాద్రిలో తడి బట్టలతో ప్రమాణం చేసిన బండి సంజయ్

  • టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుతో తమకు సంబంధం లేదన్న సంజయ్
  • ఇదే విషయంపై తాను యాదాద్రిలో ప్రమాణం చేస్తానని వెల్లడి
  • టీఆర్ఎస్ కు కూడా సంబంధం లేదంటే కేసీఆర్ ప్రమాణం చేయాలని డిమాండ్
  • లక్ష్మీనరసింహ స్వామి పాదాల వద్ద ప్రమాణం చేసిన బీజేపీ నేత
  • ఫామ్ హౌస్ డీల్ తో తమకు సంబంధం లేదని ప్రమాణం చేసిన వైనం
bandi sanjay says farm house deal is not ours in yadadri temple

టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన యత్నం తమది కాదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రమాణం చేశారు. ఈ మేరకు ఆయన యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో ప్రమాణం చేశారు. ఫామ్ హౌస్ డీల్ కాదని ఈ సందర్భంగా స్వామి వారి పాదాల దగ్గర బండి సంజయ్ ప్రమాణం చేశారు. ఫామ్ హౌస్ వ్యవహారంతో తమకు సంబంధం లేదని ఇదివరకే చెప్పిన సంజయ్... ఆ విషయంపై తాను యాదాద్రిలో ప్రమాణం చేస్తానని.. సీఎం కేసీఆర్ కు దమ్ముంటే ఆయన కూడా వచ్చి ప్రమాణం చేయాలని పిలుపునిచ్చారు.

తాను చెప్పినట్లుగా శుక్రవారం బండి సంజయ్ యాదాద్రి బయలుదేరారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి ఆయనకు ఒకింత అడ్డగింత ఎదురైంది. మరోవైపు బండి సంజయ్ కంటే ముందే యాదాద్రి చేరిన టీఆర్ఎస్ శ్రేణులు అక్కడ వెలసిన బీజేపీ జెండాలను చించేశాయి. అయితే ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తాను యాదాద్రి వెళ్లి తీరతానని సంజయ్ తేల్చిచెప్పారు. అనుకున్నట్లుగానే శుక్రవారం మధ్యాహ్నానికి యాదాద్రి చేరిన సంజయ్... ఆలయ స్నానఘట్టంలో స్నానమాచరించి... తడిబట్టలతోనే లక్ష్మీనరసింహ స్వామి వారి పాదాల వద్దకు చేరి ప్రమాణం చేశారు.

More Telugu News