Sajjala Ramakrishna Reddy: కృష్ణయ్య దీన్ని ఒక సర్టిఫికెట్ లా భావిస్తున్నారు: బీసీ సభలో సజ్జల వ్యాఖ్యలు

  • విజయవాడలో బీసీల ఆత్మగౌరవ సభ
  • హాజరైన సజ్జల
  • టీడీపీ ప్రభుత్వం బీసీలను పట్టించుకోలేదని విమర్శలు
  • సీఎం జగన్ పెద్దపీట వేశారని వెల్లడి
Sajjala attends BC meeting in Vijayawada

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ ను వేనోళ్ల కీర్తించారు. గత టీడీపీ ప్రభుత్వం బీసీలను ఏనాడూ పట్టించుకోకపోగా, జగన్ అధికారంలోకి వచ్చి బీసీల ఆకాంక్షలకు పెద్దపీట వేశాడని కొనియాడారు. 

బీసీలకు సామాజిక న్యాయం వర్తింపజేసిన నేత సీఎం జగన్ అని అన్నారు. వివిధ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడించారు. వైసీపీ తరఫున బీసీ నేత ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపిన ఘనత సీఎం జగన్ సొంతమని సజ్జల పేర్కొన్నారు. తద్వారా కృష్ణయ్య పార్లమెంటులో బీసీల సమస్యలను లేవనెత్తగలుగుతున్నారని వివరించారు. 

బీసీలకు సీఎం జగన్ ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో చెప్పేందుకు కృష్ణయ్యకు రాజ్యసభ అవకాశం కల్పించడమే నిదర్శనమని తెలిపారు. దీన్ని కృష్ణయ్య ఒక సర్టిఫికెట్ లా పరిగణిస్తున్నారని సజ్జల తెలిపారు. బీసీల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా జగన్ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రపంచం అర్థం చేసుకోవాలని సజ్జల పేర్కొన్నారు.

More Telugu News