TRS: ఆ నలుగురు ఎమ్మెల్యేలను అభినందించిన కేసీఆర్

  • ‘ఆపరేషన్ ఆకర్ష్’ను బయటపెట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
  • వారితో అత్యవసరంగా సమావేశమైన కేసీఆర్
  • డబ్బు, కాంట్రాక్టులు, పదవుల ఎర వేసిన నిందితులు
  • ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
KCR meets those four TRS MLAs

పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు ఇస్తామంటూ తమను కొందరు ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేశారంటూ ‘ఆపరేషన్ ఆకర్ష్’ గుట్టు రట్టు చేసిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. కుట్రను బయటపెట్టిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తదితరులతో ముఖ్యమంత్రి కేసీఆర్ గత రాత్రి ప్రగతి భవన్‌లో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘ఆపరేషన్ ఆకర్ష్’ కుట్రను బయటపెట్టిన నలుగురు ఎమ్మెల్యేలను సీఎం అభినందించారు. 

పైన పేర్కొన్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కొందరు ప్రయత్నించారు. మొయినాబాద్ అజీజ్ నగర్‌లోని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో వారితో బేరసారాలు నిర్వహించారు. పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామని ప్రలోభపెట్టారు. సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు ఢిల్లీలోని ఫరీదాబాద్ ఆలయానికి చెందిన రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, సింహయాజి, నందకుమార్‌లను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

More Telugu News