Karnataka minister: మంత్రి గారి ఇంట్లో లక్ష్మీదేవి పూజ.. లక్ష నగదు, బంగారంతో పిలుపు.. ఎక్కడంటే

  • మునిసిపల్, పంచాయతీ సభ్యులకు కర్నాటక మంత్రి ఖరీదైన బహుమతి
  • తన నియోజకవర్గంలోని ముఖ్యమైన అధికారులకూ అందజేత
  • వివాదాస్పదంగా మారిన దీపావళి కానుక
  • ఏటా పంపిస్తారని అనుచరుల వివరణ
Karnataka Minister Diwali gift for elected reps sparks row

దీపావళి సందర్భంగా కర్నాటక మంత్రి ఆనంద్ సింగ్ తన ఇంట్లో లక్ష్మీ దేవి పూజ చేయాలని తలపెట్టారు.. ఏర్పాట్లు చూడాలంటూ అనుచరులకు ఆదేశాలిచ్చారు. ఆహ్వానితుల జాబితాను దగ్గరుండి తయారు చేయించిన మంత్రి, వారికి అందించే ఆహ్వానం తన స్థాయికి తగ్గకుండా చూశారు. దీపావళి కానుకలతో ఓ పెట్టెను పంపించారు. అందుకునే వారి స్థాయిని బట్టి అందులో కానుకలు సర్దించారు. 

తన నియోజకవర్గం హోస్పేటలోని కార్పొరేటర్లకు పంపే బాక్స్ లో లక్ష రూపాయల నగదు, 144 గ్రాముల బంగారం, కేజీ వెండి, సిల్క్ చీర, ఓ ధోతీతో పాటు స్వీట్లతో నింపారు. ఇక పంచాయతీల సభ్యులకు ఒక్క బంగారం తప్ప మిగతావన్నీ సర్దించి పంపించారు. నియోజకవర్గంలోని కొందరు ముఖ్యమైన అధికారులకూ ఈ ‘ఆహ్వానం’ అందినట్లు సమాచారం. మంత్రి పంపించిన ఈ బాక్స్ చిత్రాలు ఆన్ లైన్ లో వైరల్ గా మారాయి.

ఏటా ఇలాగే పంపిస్తారు..
మంత్రి కానుకల పంపిణీపై ఆయన అనుచరులు స్పందించారు. ప్రతి ఏటా దీపావళికి మంత్రి ఇలాగే కానుకలు పంపిస్తారని వివరించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఈసారి మంత్రి పంపిన కానుకలపై వివాదం నెలకొందని తెలిపారు. అయితే, ఈ విషయంపై మంత్రి ఆనంద్ సింగ్ స్పందించలేదు.

More Telugu News