MS Dhoni: సినీరంగంలోకి అడుగుపెట్టిన ధోనీ.. తొలి చిత్రం ఏ భాషలో తీస్తున్నాడో తెలుసా?

  • ధోనీ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేసిన ధోనీ 
  • మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న సాక్షి సింగ్ ధోనీ
  • తమిళంలో తొలి సినిమాను నిర్మించనున్న ధోనీ
MS Dhoni to produce Tamil film

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నాడు. తాజాగా సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. ధోనీ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో తన భార్య సాక్షి సింగ్ తో కలిసి ధోనీ ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేశాడు. ఈ కంపెనీకి సాక్షి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. తమ నిర్మాణ సంస్థ నుంచి తొలుత తమిళ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి రమేశ్ తమిళ్ మణి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా కాస్ట్, క్రూ వివరాలను త్వరలోనే ప్రకటించబోతున్నారు. 

ఈ సినిమా గురించి సాక్షి మాట్లాడుతూ... ఈ చిత్రం ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుందని చెప్పారు. అంతేకాదు ఈ సినిమా కథను సాక్షినే రాశారు. దీనిపై తమిళ్ మణి మాట్లాడుతూ... సాక్షి రచించిన కథను తాను చదివిన క్షణంలో అద్భుతమైన అనుభూతికి గురయ్యానని చెప్పారు. కథ చాలా కొత్తగా ఉందని... ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రజలను ఆకట్టుకునే సత్తా ఈ కథకు ఉందని అన్నారు. 

మరోవైపు, ఇతర ఫిల్మ్ మేకర్స్, స్క్రిప్ట్ రైటర్స్ తో కూడా ధోనీ ఎంటర్ ట్టైన్ మెంట్ చర్చలు జరుపుతోంది. ఫిక్షన్, క్రైమ్ డ్రామా, కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్ కథలపై చర్చలు జరుపుతోంది. మరి... క్రికెటర్ గా అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న ధోనీ... సినీ రంగంలో ఎంత వరకు రాణిస్తారనే విషయాన్ని వేచి చూడాలి.

More Telugu News