Pakistan: కెన్యాలో పాకిస్థాన్ జర్నలిస్ట్ అర్షద్ షరీఫ్ కాల్చివేత

  • ధ్రువీకరించిన షరీఫ్ భార్య
  • తమ కుటుంబ ఫొటోలు, వ్యక్తిగత వివరాలు షేర్ చేయొద్దని విన్నపం
  • ప్రాణాలకు ముప్పు ఉండడంతో పాక్ నుంచి దుబాయ్‌కు షరీఫ్
  • అక్కడ కూడా వెంటాడుతుండడంతో కెన్యాకు
pakistani Journalist arshad sharif shot dead in kenya

కెన్యాలో జరిగిన పోలీసు కాల్పుల్లో పాకిస్థాన్ జర్నలిస్ట్ అర్షద్ షరీఫ్ మృతి చెందారు. అర్షద్ మృతిని ఆయన భార్య ధ్రువీకరించారు. పోలీసు కాల్పుల్లో తన స్నేహితుడు, భర్త, తన ఫేవరెట్ జర్నలిస్ట్ అర్షద్‌ మృతి చెందారని ఆయన భార్య జవేరియా సిద్ధిఖి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కుటుంబ ఫొటోలు, వ్యక్తిగత వివరాలను షేర్ చేయొద్దని, తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని మరో ట్వీట్‌లో జవేరియా అభ్యర్థించారు. పాకిస్థాన్‌లో తన ప్రాణాలకు ముప్పు ఉందని గ్రహించిన షరీఫ్‌ దేశాన్ని విడిచి దుబాయ్ వెళ్లారు. అయితే, దుబాయ్‌లోనూ తనను కొందరు వెంటాడుతున్నట్టు గుర్తించిన షరీఫ్ అక్కడి నుంచి కెన్యా వెళ్లారు.

షరీఫ్‌ను హత్యకు ఆఫ్ఘన్ హంతకులు పథకం పన్నారని ఆయన స్నేహితులు చెబుతున్నారు. షరీఫ్‌ నైరోబీ శివారులో హత్యకు గురయ్యారు. ఉద్దేశపూర్వకంగా తలలో కాల్చి చంపినట్టు చెబుతున్నారు. షరీఫ్ హత్యపై కెన్యాలోని పాకిస్థాన్ హై కమిషన్ వివరాలు సేకరిస్తోంది. షరీఫ్ హత్యను ధ్రువీకరించుకున్న తర్వాత అధికారులతో కలిసి కెన్యాలో పాకిస్థాన్ రాయబారి నైరోబీలోని కిరోమో ఫ్యునెరల్ హౌస్‌కు చేరుకున్నారు. అక్కడ షరీఫ్ మృతదేహాన్ని గుర్తించారు. అర్షద్ షరీఫ్ మృతిపై పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ కూడా సంతాపం తెలిపారు.

More Telugu News