Cyclone: బంగాళాఖాతంలో దిశ మార్చుకోనున్న తుపాను

  • బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
  • ఈ రాత్రికి తుపానుగా మారే అవకాశం
  • దిశ మార్చుకుని బంగ్లాదేశ్ దిశగా పయనం
  • ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలకు భారీ వర్షసూచన
IMD predicts Cyclone will change its course towards Bangladesh

అండమాన్ సముద్రం వద్ద ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా, ఆపై తీవ్ర వాయుగుండగా మారిందని, ప్రస్తుతం ఇది పశ్చిమ మధ్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. పోర్ట్ బ్లెయిర్ కు  వాయవ్య దిశలో 475 కిమీ దూరంలో, బంగ్లాదేశ్ కు దక్షిణంగా 880 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది. 

గడచిన 6 గంటలుగా ఇది గంటకు 18 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా పయనిస్తోందని ఐఎండీ పేర్కొంది. ఈ రాత్రికి ఇది తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. తుపానుగా మారిన అనంతరం దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తుందని, ఈ నెల 25 వేకువజామున బంగ్లాదేశ్ లోని టింకోనా ద్వీపం, సాంద్విప్ మధ్య తీరం దాటుతుందని అంచనా వేసింది. 

నేడు అండమాన్ నికోబార్ దీవుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, ఒడిశాలో నేడు, రేపు, ఎల్లుండి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, పశ్చిమ బెంగాల్ లో మూడ్రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఈ నెల 25న బెంగాల్ లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. 

అటు ఈశాన్య రాష్ట్రాలకు కూడా వర్షసూచన చేసింది. ఈ నెల 25 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది.

More Telugu News