Komatireddy Venkat Reddy: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన కాంగ్రెస్ హైకమాండ్

  • మునుగోడులో ఉప ఎన్నిక
  • బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  • తన తమ్ముడికి ఓటేయాలని కాంగ్రెస్ కార్యకర్తలను కోరిన వెంకట్ రెడ్డి
  • సామాజిక మాధ్యమాల్లో వీడియో
  • తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ అధిష్ఠానం
Congress high command issues show cause notice to Komatireddy Venkat Reddy

తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తుండడం కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితిని సృష్టించింది. అటు సోదరుడు, ఇటు కాంగ్రెస్ పార్టీ... ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు ఉప ఎన్నిక వ్యవహారానికి దూరంగా ఉండాలని కుటుంబంతో సహా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినట్టు తెలుస్తోంది. 

అయితే, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు ఫోన్లు చేసి బీజేపీ అభ్యర్థిగా ఉన్న తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని కోరినట్టు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా స్పందించింది. 

కాంగ్రెస్ కార్యకర్తలకు ఫోన్ చేసి బీజేపీకి ఓటేయాలని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హైకమాండ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించారని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

More Telugu News