Somu Veerraju: పవన్ కల్యాణ్ తో పొత్తు కొనసాగుతుంది.. చంద్రబాబు హయాంలో కూడా ప్రజాస్వామ్యంపై దాడి జరిగింది!: సోము వీర్రాజు

  • మా నాయకుడు పవన్ ను చంద్రబాబు కలవడాన్ని స్వాగతిస్తున్నామన్న వీర్రాజు
  • చంద్రబాబు గతాన్ని గర్తుంచుకుంటే మంచిదని వ్యాఖ్య  
  • అమిత్ షాపై రాళ్ల దాడి జరిగిందని విమర్శ
BJP will work with Pawan Kalyan says Somu Veerraju

ఏపీలో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇంతకాలం బీజేపీతో కలిసి ప్రయాణించిన జనసేన... ఇకపై ఆ పార్టీతో పొత్తు ఉండదని పరోక్షంగా తెలిపింది. బీజేపీకి ఊడిగం చేయలేమని జనసేనాని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కలిసి పని చేయడానికి రూట్ మ్యాప్ ఇవ్వాలని కోరినా బీజేపీ నేతలు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. మరోవైపు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. సోము వీర్రాజు వల్లే బీజేపీకి పవన్ దూరమయ్యారని ఆయన అన్నారు. 

ఈ నేపథ్యంలో సోము వీర్రాజు మాట్లాడుతూ... తమ నాయకుడు పవన్ కల్యాణ్ ను చంద్రబాబు కలిసి సంఘీభావం తెలిపారని చెప్పారు. తమ నాయకుడిని చంద్రబాబు కలవడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని చెప్పారు. చంద్రబాబు హయాంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై రాళ్ల దాడి జరిగిందని తెలిపారు. తన హయాంలో జరిగిన విషయాలను చంద్రబాబు గర్తుంచుకుంటే మంచిదని అన్నారు.

 ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే పేరుతో చేసే ఉమ్మడి ఉద్యమం అంశంపై మీడియా అనవసరంగా బీజేపీని ప్రశ్నించాల్సిన అవసరం లేదని చెప్పారు. రాజకీయాల్లో అన్నీ ఉంటాయని.. కన్నా లక్ష్మీనారాయణ చేసిన కామెంట్లను కూడా ఇదే కోణంలో చూస్తామని అన్నారు. పవన్ తో కలిసి పని చేస్తామని తెలిపారు. జనసేనతో కలిసి రూట్ మ్యాప్ ను తయారు చేసుకుంటామని వీర్రాజు చెప్పారు.

More Telugu News