Pawan Kalyan: దత్తపుత్రుడి ముసుగు తొలగింది.. ముసుగు వెనకాల చంద్రబాబు గులాంగిరీ ఉంది: పేర్ని నాని

  • పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నుంచి మొదలైన ఎదురు దాడి
  • పవన్ ను సన్నాసిన్నర సన్నాసి అన్న పేర్ని నాని
  • 175 స్థానాల్లో జనసేన అభ్యర్థులను నిలిపితే సారీ చెబుతానని వెల్లడి
ysrcp mla perni nani hiots backon pawan kalyan comments

తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నుంచి వెనువెంటనే ఎదురు దాడి మొదలైపోయింది. ఇప్పటికే ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు... పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూ... పవన్ ముమ్మాటికీ ప్యాకేజీ స్టారేనని స్పష్టం చేశారు. తాజాగా ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని కూడా పవన్ వ్యాఖ్యలపై ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. పవన్ తాజా వ్యాఖ్యలతో దత్తపుత్రుడి ముసుగు తొలగిందని నాని వ్యాఖ్యానించారు. దత్తపుత్రుడి ముసుగు వెనుక చంద్రబాబు ఉన్నాడని తేలిపోయిందని కూడా నాని అన్నారు.

పవన్ ప్రసంగం ముగిసినంతనే మంగళవారం మీడియా ముందుకు వచ్చిన పేర్ని నాని.. పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూనే... పవన్ పై ఎదురు దాడికి దిగారు. దత్తపుత్రుడిగా మారిన పవన్... సన్నాసిన్నర సన్నాసిగా కూడా మారిపోయారని ఆయన సెటైర్లు సంధించారు. తన పార్టీకి కాకుండా మరో పార్టీకి ఓటేయమని చెప్పే నేతను ప్యాకేజీ స్టార్ అనకుండా ఇంకేమంటారని నాని అన్నారు. సోదరా అంటేనే పవన్ కడుపు రగిలిపోతే... వైసీపీలోని కాపు ఎమ్మెల్యేలను నా కొడకల్లారా అంటే తమకు కడుపు మండదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను పట్టుకుని నా కొడకల్లారా అనేంత బలుపు పవన్ ది అని ఆయన ధ్వజమెత్తారు. పవన్ కు అంత బలుపెందుకు? అని నిలదీశారు.

తాను ఇంతవరకు పవన్ కల్యాణ్ ను ప్యాకేజీ స్టార్ అనలేదన్న నాని... తమ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఆ మాట అన్నారన్నారు. అయితే 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 స్థానాల్లో జనసేన అభ్యర్థులను నిలిపితే... పవన్ ను ప్యాకేజీ స్టార్ అన్న అందరి తరఫున తానే క్షమాపణ చెబుతానన్నారు. ఇవాల్టీ నుంచి రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారుతుందని పవన్ ప్రకటించారంటే...జనసేన తిరిగి టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లేనన్నారు. అందులో భాగంగా బీజేపీకి కూడా గుడ్ బై చెప్పేశారని నాని అన్నారు.

More Telugu News