Indian Railways: దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే వివేక్​ ఎక్స్​ ప్రెస్​.. మీకు తెలుసా? అంటూ రైల్వే ట్వీట్​

  • తమిళనాడులోని కన్యాకుమారి నుంచి అస్సాంలోని దిబ్రూగర్ వరకు ప్రయాణం
  • 9 రాష్ట్రాల మీదుగా 4,150 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం
  • రైల్వే ట్వీట్ పై భిన్నంగా స్పందిస్తున్న ప్రయాణికులు
  • సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలంటూ సూచనలు
Indias longest train route dibrugarh to kanyakumari vivek express

ఒక్కోసారి రైలులో దూర ప్రయాణం చేస్తుంటాం. ఇంత అంత అని కాదు.. రాత్రీపగలూ ఒకట్రెండు రోజులు రైల్లోనే ఉంటుంటాం. చవకగా దూర ప్రయాణాలు చేయడానికి మనకు వీలుగా ఉండేది రైళ్లు మాత్రమే. మరి మన దేశంలో అలా సుదీర్ఘ ప్రయాణం చేసే రైలు ఏదో తెలుసా? వివేక్ ఎక్స్ ప్రెస్.. కన్యాకుమారి నుంచి అస్సాంలోని దిబ్రుఘర్ వరకు ప్రయాణించే ఈ ఎక్స్ ప్రెస్ రైలు గురించి మీకు తెలుసా? అంటూ తాజాగా రైల్వే ట్విట్టర్ లో పోస్టు పెట్టింది.

9 రాష్ట్రాల మీదుగా..
మన దేశంలో అత్యంత దూరం ప్రయాణించే ఈ వివేక్ ఎక్స్ ప్రెస్ కన్యాకుమారి నుంచి అస్సాంలోని దిబ్రూగర్ వరకు ఏకంగా 4,150 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. వివిధ రాష్ట్రాల్లో 58 చోట్ల ఆగుతుంది. ఒక కొస నుంచి మరో కొసకు ప్రయాణించడానికి 74 గంటల నుంచి 79 గంటలు పడుతుందని రైల్వే తెలిపింది. 2011లో స్వామి వివేకానందుడి 150వ జయంతి సందర్భంగా ఈ రైలును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపాదించారు. ఈ క్రమంలోనే దీనికి వివేక్ ఎక్స్ ప్రెస్ అని పేరు పెట్టారు.

  • రైల్వే పెట్టిన ట్వీట్ పై భిన్నమైన కామెంట్లు వస్తున్నాయి. ‘అసలు మన రైల్వేలో సౌకర్యాలే ఉండవు. అలాంటిది అంత దూరం రైల్లో ప్రయాణిస్తే అంతే’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
  • ‘‘ఏ మాత్రం ‘వివేకం’ లేనివారు మాత్రమే ఈ వివేక్‌ ఎక్స్‌ ప్రెస్‌ లో ప్రయాణం చేస్తారు. అన్నీ పాత బోగీలు, పనిచేయని టాయిలెట్లు, బొద్దింకలు.. చాలా చోట్ల గంటల తరబడి ఆపడాలు..’’ అంటూ ఓ నెటిజన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • ‘ఈ రైలులో ఓ చివరి నుంచి మరో చివరికి ప్రయాణించారంటే.. ఆ నాలుగు రోజులూ స్నానం లేకుండా గడపాల్సిందే’ అని ఒకరు పేర్కొంటే.. ‘రైలులో చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయడం, మూలల వద్ద పాన్, గుట్కాలు ఉమ్మేయడం, బాత్రూం వెళ్లాక నీళ్లు పోయకుండా అలాగే వచ్చేయడం. ముందు ప్రయాణికులు ఇలాంటివన్నీ చేయడం మానేస్తే రైళ్లు బాగానే ఉంటాయి..’ అని మరికొందరు రైల్వేకు మద్దతుగా నిలుస్తున్నారు. 
  • ‘అసలు అంత దూరం రైలును భద్రంగా నడుపుతూ, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసే లోకో పైలట్లకు సెల్యూట్‌ చేయాలి. కుటుంబాన్ని వదిలి అన్నిరోజులు డ్యూటీలో ఉండేవారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి..’’ అని భారతీయ రైల్వేకు ఓ నెటిజన్‌ విజ్ఞప్తి చేశారు.

ప్రపంచంలో పొడవైన రైలు రష్యాలో..
మన దేశంలో అత్యధిక దూరం ప్రయాణించేది వివేక్ ఎక్స్ ప్రెస్ అయినా.. ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు మార్గం మాత్రం రష్యాలో ఉంది. రష్యా పశ్చిమ, తూర్పు కొసలను కలుపుతూ ఏకంగా 9,250 కిలోమీటర్ల పొడవున ఆ రైలు మార్గం ఉంది. ‘ట్రాన్స్ సైబీరియన్ రైల్వే’గా పిలిచే ఈ మార్గం రష్యా రాజధాని మాస్కోను తూర్పు కొసలోని వ్లాదివోస్టోక్ ను కలుపుతుంది.

More Telugu News