T20 World Cup: ఆసియాకప్ విజేత శ్రీలంకకు ఆదిలోనే షాకిచ్చిన నమీబియా.. పేరు గుర్తుపెట్టుకోవాలన్న సచిన్ ట్వీట్ వైరల్

  • క్వాలిఫయర్ మ్యాచ్‌లో పసికూన నమీబియా చేతిలో ఓడిన లంక
  • బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన నమీబియా
  • తమ పేరు గుర్తుపెట్టుకోమని నమీబియా సందేశమిచ్చిందన్న సచిన్
Sachin Tendulkar Tweet On Namibia went Viral

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆసియాకప్ విజేత శ్రీలంకతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో నమీబియా సంచలన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పసికూన నమీబియా చెలరేగిపోయింది. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అనంతరం 164 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంకను నమీబియా బౌలర్లు బెంబేలెత్తించారు. పదునైన బంతులు విసురుతూ బ్యాటర్లను వణికించారు. వారి దెబ్బకు శ్రీలంక బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. మరో ఓవర్ మిగిలి ఉండగానే 108 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.


ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో నమోదైన సంచలనం అనంతరం టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ‘తన పేరును గుర్తు పెట్టుకోమని నమీబియా క్రికెట్ ప్రపంచానికి చాటిచెప్పింది’ అని సచిన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు ఇప్పటి వరకు 63 వేలకు పైగా లైకులు వచ్చాయి. మూడున్నర వేలమంది రీట్వీట్ చేశారు. కాగా, శ్రీలంకపై అద్భుత విజయం సాధించిన నమీబియాపై ప్రశంసలు కురుస్తున్నాయి. అద్భుత పోరాట పటిమ అంటూ ఆ జట్టును ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

More Telugu News