USA: పాకిస్థాన్ అత్యంత ప్రమాదకర దేశమన్న బైడెన్ వ్యాఖ్యలపై పాక్ ప్రధాని స్పందన

  • సమాచారం లేకుండా పాక్ అణ్వాయుధాలు కలిగి ఉందన్న బైడెన్
  • వీటిని ఖండించిన పాక్ పీఎం  షెహబాజ్ షరీఫ్
  • తమది బాధ్యతాయుత అణు దేశం అన్న షరీఫ్
On Biden Most Dangerous Nation Comment Pak PM Response

పాకిస్థాన్ అణ్వాయుధ సామర్థ్యంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖండించారు. పాక్ ను బైడెన్ అత్యంత ప్రమాదకర దేశంగా అభివర్ణించారు. దీనిపై స్పందించిన షరీఫ్.. ఈ వ్యాఖ్యలు సత్యదూరమైనవని, తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు. ‘గత దశాబ్దాలుగా పాకిస్థాన్ అత్యంత బాధ్యతాయుతమైన అణు రాజ్యంగా నిరూపించబడింది. మా అణు కార్యక్రమం సాంకేతికంగా, ఫూల్‌ప్రూఫ్ కమాండ్, కంట్రోల్ సిస్టమ్ ద్వారా నిర్వహించబడుతుంది’ అని పాక్ ప్రధాని  ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

‘పాకిస్థాన్, అమెరికా ఎంతో కాలంగా  స్నేహపూర్వక, పరస్పర ప్రయోజనకరమైన సంబంధాలు కలిగి ఉన్నాయి. ప్రపంచం భారీ సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో పాక్ నిజమైన సామర్థ్యాన్ని గుర్తించడానికి, మన్నికైన ప్రయత్నాలు చేయాలి. అంతే తప్ప పాక్–అమెరికా సంబంధంపై అనవసరమైన వ్యాఖ్యలకు దూరంగా ఉండాలి. శాంతి, భద్రతలను పెంపొందించడానికి యుఎస్‌తో సహకరించాలనేది మా కోరిక’ అని షరీప్ అన్నారు. 
 
అంతకుముందు బైడెన్ పాకిస్థాన్‌ను ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఒకటి అని అభివర్ణించారు. ఎలాంటి సమాచారం, సమన్వయం లేకుండా పాక్ అణ్వాయుధాలను కలిగి ఉందని లాస్ ఏంజిల్స్ (కాలిఫోర్నియా)లో జరిగిన డెమొక్రాటిక్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ రిసెప్షన్‌లో అమెరికా అధ్యక్షుడు విమర్శించారు. చైనా, రష్యాకు సంబంధించి అమెరికా విదేశాంగ విధానం గురించి బైడెన్ మాట్లాడుతుండగా పాకిస్థాన్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా తాను భావిస్తున్నట్లు బైడెన్ చెప్పారు. దీనిపై ఇది వరకే ట్విట్టర్ లో స్పందించిన షరీఫ్.. ‘పాక్ బాధ్యతాయుతమైన అణు దేశం. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ  అవసరాలకు అనుగుణంగా మా అణు ఆస్తులకు అత్యుత్తమ రక్షణలు ఉన్నందుకు మేం గర్విస్తున్నాము. మేము ఈ భద్రతా చర్యలను తీసుకుంటాము. దీనిపై ఎవరికీ ఎలాంటి సందేహాలు వద్దు’అని ట్వీట్ చేశారు.

More Telugu News