YSRCP: విశాఖ‌లో హైటెన్ష‌న్‌.. రోజా, జోగి ర‌మేశ్‌, వైవీ సుబ్బారెడ్డి కార్ల‌పై జ‌న‌సైనికుల దాడి

  • విశాఖ గ‌ర్జ‌న‌కు హాజ‌రైన సుబ్బారెడ్డి, రోజా, జోగి ర‌మేశ్
  • తిరుగు ప్ర‌యాణంలో ఎయిర్‌పోర్టు చేరుకున్న నేత‌లు
  • అదే స‌మ‌యంలో ప‌వ‌న్‌కు స్వాగ‌తం ప‌లికేందుకు వ‌చ్చిన జ‌న‌సైనికులు
  • వైసీపీ నేత‌ల కార్ల‌పై రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడి చేసిన జ‌న‌సేన శ్రేణులు
  • వైసీపీ నేత‌ల కార్ల అద్దాలు ధ్వంసం
janasena cadre attack on ysrcp leaders carsin vizag

విశాఖ‌లో శ‌నివారం తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది. అధికార వికేంద్రీక‌ర‌ణ‌కు మ‌ద్ద‌తుగా అధికార వైసీపీ చేప‌ట్టిన విశాఖ గ‌ర్జ‌న‌కు హాజ‌రై తిరిగి వెళుతున్న స‌మ‌యంలో వైసీపీ కీల‌క నేత‌, టీటీడీ చైర్మ‌ర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు ఆర్కే రోజా, జోగి ర‌మేశ్ కార్ల‌పై జ‌నసేన కార్య‌క‌ర్త‌లు దాడికి పాల్ప‌డ్డారు. ఈ దాడిలో సుబ్బారెడ్డితో పాటు మంత్రుల కార్ల అద్దాలు ధ్వంస‌మ‌య్యాయి. 

విశాఖ గ‌ర్జ‌న‌కు హాజ‌రైన సుబ్బారెడ్డి, రోజా, జోగి ర‌మేశ్ కార్య‌క్ర‌మాన్ని ముగించుకుని శ‌నివారం సాయంత్రం స‌మ‌యంలో విశాఖ నుంచి బ‌య‌లుదేరేందుకు ఎయిర్‌పోర్టుకు బ‌య‌లుదేరారు. అదే స‌మ‌యంలో ఉత్త‌రాంధ్ర జిల్లాల ప‌ర్య‌ట‌న కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ విశాఖ ఎయిర్ పోర్టు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌కు స్వాగ‌తం ప‌లికేందుకు జ‌న సైనికులు భారీ సంఖ్య‌లో ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ స‌మ‌యంలోనే వైసీపీ నేత‌ల కార్లు క‌నిపించ‌డంతో క‌ర్ర‌లు, రాళ్లు చేత‌బ‌ట్టిన జ‌న‌సైనికులు కార్ల‌పై దాడికి దిగారు. ఈ దాడితో విశాఖ‌లో ఒక్క‌సారిగా ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

More Telugu News