Jairam Ramesh: ఏపీ విభజనకు అనుకూలంగా వైసీపీ రాసిన లేఖను షేర్ చేస్తూ.. విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన జైరామ్ రమేశ్

  • ఏపీని కాంగ్రెస్ విభజించిందన్న విజయసాయిరెడ్డి
  • అప్పటి కేంద్ర హోం మంత్రికి వైసీపీ రాసిన లేఖను షేర్ చేసిన జైరామ్
  • దీని గురించి ఏమంటారు? అంటూ ప్రశ్న
Jairam Ramesh counter to Vijayasai Reddy

ఏపీని కాంగ్రెస్ పార్టీ విభజించిందన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏపీలో ప్రవేశిస్తున్న నేపథ్యంలో విజయసాయి ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు. ఎనిమిదేళ్ల క్రితం ఏపీని కాంగ్రెస్ విభజించిన విషయాన్ని రాహుల్ కు రాష్ట్ర ప్రజలు గుర్తు చేయాలని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ కు మిగిలింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. 

విజయసాయి వ్యాఖ్యలకు జైరామ్ రమేశ్ కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు అనుకూలంగా అప్పటి కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు వైసీపీ లేఖ రాసిందని చెప్పారు. 2012 డిసెంబర్ లో వైసీపీ తరపున మీ సీనియర్ సహచరులు లేఖ రాశారని తెలిపారు. మీ పార్టీ అధినేత జగన్ ఆమోదంతోనే ఆ లేఖను రాశారని చెప్పారు. ఈ విషయం మీకు గుర్తుందా? అని ప్రశ్నించారు. మైసూరా రెడ్డి, కేకే మహేందర్ రెడ్డిల సంతకాలతో ఉన్న లేఖను ట్విట్టర్ లో షేర్ చేశారు. అంతేకాదు... ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతు తెలిపిన జగన్ అంటూ ఎకనామిక్ టైమ్స్ లో వచ్చిన వార్తను కూడా పోస్ట్ చేశారు. దీని గురించి ఏమంటారు విజయసాయి గారు? అని ప్రశ్నించారు. 

More Telugu News