Chandrababu: అమరావతి అంటే నీకెందుకంత కంపరం?: సీఎం జగన్ ను నిలదీసిన చంద్రబాబు

  • టీడీపీ ఆఫీసులో లీగల్ సెల్ సమావేశం
  • హాజరైన చంద్రబాబు
  • కొత్త కమిటీతో ప్రమాణస్వీకారం
  • న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగం
Chandrababu questioned CM Jagan why he hates Amaravati

టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ లీగల్ సెల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత చంద్రబాబు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రాజ్యసభ సభ్యుడు, పార్టీ న్యాయవిభాగం అధ్యక్షుడు కనకమేడల రవీంద్రకుమార్ హాజరయ్యారు. వివిధ జిల్లాలకు చెందిన న్యాయవాదులు ఈ సమావేశానికి విచ్చేశారు. లీగల్ సెల్ కొత్త కమిటీ సభ్యులతో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, దేశంలో చరిత్ర సృష్టించిన పార్టీ టీడీపీ అని వెల్లడించారు. టీడీపీకి 40 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉందని, ఏ రాజకీయ పార్టీకి రానన్ని అవకాశాలు టీడీపీకి వచ్చాయని అన్నారు. ఇలాంటి పనికిమాలిన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జీవితంలో ఊహించలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలీస్ వ్యవస్థను వైసీపీ భ్రష్టుపట్టించిందని ఆరోపించారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పోలీస్ శాఖను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. 

వివేకా హత్య కేసు తర్వాత ఇద్దరు చనిపోయారని, అప్రూవర్ గా మారిన దస్తగిరి కూడా ప్రాణభయంతో ఉన్నాడని అన్నారు. ఏపీలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని, ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు వంటి వాడినే కస్టడీలోకి తీసుకుని పోలీసులు వేధించారని చంద్రబాబు వివరించారు. రఘురామ పట్ల పోలీసులు ఇష్టానుసారం ప్రవర్తించారని, రఘురామ ఇప్పుడు ఏపీకి రాలేని పరిస్థితి కల్పించారని పేర్కొన్నారు. ఒక ఎంపీకే ఇలా జరిగితే... సామాన్యుల పరిస్థితి ఏంటి? అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇక, టీడీపీ నేతల పట్ల పోలీసులు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేత దారపనేని నరేంద్ర అరెస్ట్ అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. "నేడు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది... పోలీసులు ఎవరైతే కొట్టారో వారి పేర్లు కూడా ఉన్నాయి. ఎవరో లక్ష్మణరావు అంట... సీఐ! మరో కానిస్టేబుల్ కూడా ఉన్నాడు... అందరి చరిత్రలు రాస్తున్నా. తప్పుచేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టేదిలేదు. 

ఏమనుకుంటున్నారు మీరు? చట్టాన్ని ఉల్లంఘిస్తే మీకు కూడా శిక్ష తప్పదు. చట్టాన్ని అతిక్రమిస్తే వారి గుండెల్లో నిద్రపోతా. ఇప్పటికే మూడున్నర సంవత్సరాలు గడిచాయి.. ఈ ఉన్మాదులతో మరో సంవత్సరం గడవాలి" అంటూ వ్యాఖ్యానించారు. 

"ఆ రోజున నేను హైదరాబాదును అభివృద్ధి చేశాను. నేను ఓడిపోయిన తర్వాత వచ్చిన పాలకులు హైటెక్ సిటీని కూలదోసి ఉంటే ఇవాళ అభివృద్ధి ఉండేదా? శంషాబాద్ ఎయిర్ పోర్టు, అవుటర్ రింగు రోడ్డును ఆపేసి ఉంటే అభివృద్ధి జరిగేదా? అప్పుడు ఉన్నది ఎవరో కాదే వీళ్ల తండ్రే. అతడు దేన్నీ ఆపలేదు కానీ, పేరు మార్చారు... అది వేరే విషయం. 

ఇవాళ హైదరాబాద్ ఉన్నతస్థాయిలో ఉందంటే నేనిచ్చిన విజనే కారణం. నాడు ఎవరూ అభ్యంతర పెట్టలేదు" అని వివరించారు. రాజధాని అమరావతి అంశాన్ని ప్రస్తావిస్తూ, నాడు అమరావతే ముద్దు అని ఈ సీఎం (జగన్) చెప్పాడని అన్నారు. 

"మనది చిన్న రాష్ట్రం, విభేదాలు వద్దు, రాజధాని విజయవాడ-గుంటూరు మధ్యన ఉండాలని చెప్పిన ఇదే ముఖ్యమంత్రి ఇప్పుడెందుకు విముఖత ప్రదర్శిస్తున్నాడు? అమరావతి అంటే నీకెందుకంత కంపరం? ప్రతి కొత్త ముఖ్యమంత్రి వచ్చి రాజధాని మార్చుతామంటే చెల్లుతుందా? కేంద్రం ఏం చెప్పింది... రాజధానిని నిర్ణయించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని వెల్లడించింది. హైకోర్టు కూడా అదే చెప్పినా, వితండవాదం చేస్తున్నారు" అని విమర్శించారు. 

ఇప్పుడు మూడు రాజధానులు అంటూ సమాజంలో ప్రాంతీయ విద్వేషాలు కలిగిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. "నీకు విశాఖపై ప్రేమ ఉంటే ఏంచేశావు? హెచ్ఎస్ బీసీ సంస్థ విశాఖ నుంచి ఎప్పుడో వెళ్లిపోయింది. లులూ గ్రూప్ వెళ్లిపోయింది, ఫార్చ్యూన్-500 కంపెనీల్లో కొన్ని వస్తే అవి కూడా వెళ్లిపోయాయి. ఈ రాష్ట్రానికే మేం రాం అంటూ ఇంకొందరు వెళ్లిపోయారు. 

విశాఖలో రుషికొండ పరిస్థితిపై హైకోర్టు ఏమని వ్యాఖ్యానించిందో అందరం చూశాం. అప్పట్లో విదేశీయులు విశాఖ వస్తే, ఆ రుషికొండను చూసి తాము వచ్చింది విశాఖకేనని నిర్ధారించుకునేవారు. అలాంటి రుషికొండకు నేడు బోడిగుండు చేసేశారు. కొండ అనేదే లేకుండా చేశారు. పర్యావరణానికి హాని కలిగించేవారిపై న్యాయవ్యవస్థలు ఉక్కుపాదం మోపిన ఘటనలు ఉన్నాయి. 

ఇక, 72 శాతం పూర్తయిన పోలవరంను ముంచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అనదగ్గది పోలవరం. ఏపీకి రెండు కళ్లు ఏవంటే ఒకటి అమరావతి, రెండు పోలవరం. ఉపాధి కల్పన కోసం, సంపదను సృష్టించడం కోసం అమరావతిని తీర్చిదిద్దాలనుకున్నాం. ఒకప్పుడు హైదరాబాదులో ఎకరా భూమి రూ.50 వేలు, రూ.1 లక్ష ఉంటే, ఇప్పుడది రూ.50 కోట్లు, రూ.60 కోట్లకు చేరింది. సంపద సృష్టించే మార్గంలోనే ఇది సాధ్యమైంది. ఇక్కడ 10 వేల ఎకరాలు మిగిలాయి. అప్పుడే రూ.10 కోట్లకు విక్రయించాం... ఇప్పుడైతే రూ.20 కోట్లు, రూ.30 కోట్లకు అమ్ముడయ్యేది. మొత్తమ్మీద రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లు ఆదాయం వచ్చేది... ఇప్పుడదంతా పోయింది. 

ప్రతి ఎకరానికి నీళ్లు వచ్చే పోలవరంను నాశనం చేశారు. ఇప్పుడక్కడ డయాఫ్రం వాల్ మునిగిపోయింది. ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి లేదు. ఇలాంటివి రాష్ట్రంలో చాలా జరిగాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక బాలకృష్ణ అన్ స్టాపబుల్-2 కార్యక్రమంలో తాను పాల్గొన్నప్పటి సంగతులను చంద్రబాబు ఈ సందర్భంగా పంచుకున్నారు. "అందుకే మొన్న బాలకృష్ణ గారు అన్నారు... నీతో ఇదే గొడవ... ఎప్పుడూ విజన్ అంటుంటావు. రాళ్లు రప్పలు ఉండే ఈ ప్రాంతంలో ఉద్యోగ కల్పన, సంపద సృష్టించావు. ఆ రోజు బాహుబలి సినిమా రాలేదు కానీ, వచ్చుంటే అవి కూడా గ్రాఫిక్స్ అనేవాళ్లు... ఇప్పుడు గ్రాఫిక్స్ అనే పరిస్థితికి వచ్చారని బాలయ్య అన్నారు. 

ఇప్పుడదే అంటున్నారు... అమరావతి గ్రాఫిక్స్ అట! మరి హైదరాబాద్ గ్రాఫిక్సా? అదీ నా విజన్... ఇదీ మీ 420 విధానం! ఈ మాత్రం అర్థం చేసుకోలేకపోతే ఎవరేం చేయగలరు? కానీ నా బాధ, ఆవేదన రాష్ట్రం గురించే. ప్రపంచమంతా రాణించే తెలుగుజాతి ఉన్న ఈ రాష్ట్రం విధ్వంసానికి గురవుతోంది. రివర్స్ పాలనలో రివర్స్ గేర్ లో వెళుతోంది. "ఇది తప్పు" అని అడిగిన వాడిపై దాడి చేసే పరిస్థితి ఉంది" అని వివరించారు. 

భవిష్యత్తులో టీడీపీలో రికమెండేషన్స్ ఉండవని, కష్టపడి పనిచేసేవారిని వెతికి తీసుకువచ్చి పదవులతో గౌరవిస్తానని స్పష్టం చేశారు. పార్టీ కోసం శ్రమించేవారి పిల్లలకు ఉన్నత భవిష్యత్తును ఇచ్చే బాధ్యత తనదని చంద్రబాబు భరోసా ఇచ్చారు. 

"అడ్వకేట్లు తమ విధులు నిర్వహిస్తూనే పార్టీ కార్యకర్తల కోసం సమయం పెట్టండి. మనమీద తప్పుడు కేసులు పెట్టిన వారిని కట్టడి చెయ్యాలి అంటే ప్రైవేటు కేసులు వేయాల్సిందే. ప్రతి నియోజకవర్గంలో అడ్వకేట్లు ఒక టీంగా ఏర్పడి అక్కడి కేసులపై గైడ్ చెయ్యాలి. దీనికి అడ్వకేట్ల సహకారం కోరుతున్నాను. అధికారంలోకి వచ్చిన తరువాత అడ్వకేట్లకు మంచి అవకాశాలు కల్పిస్తాం" అని స్పష్టం చేశారు.

More Telugu News