Mohammad Shafi: కేరళలో నరమాంస భక్షణ... శరీర భాగాలు ఉన్న 61 ప్యాకెట్లు లభ్యం

  • ఎర్నాకుళంలో భయానక ఘటన
  • ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చిన కిరాతకులు
  • ఆపై శరీర భాగాలను కోసి వండుకుని తిన్న వైనం
  • నిందితులకు 14 రోజుల కస్టడీ
Kerala police found 61 packets contains body parts

కేరళలోని ఎర్నాకుళంలో ఇద్దరు మహిళలు దారుణ రీతిలో హతులవడం సంచలనం సృష్టించింది. తొలుత సంపద కోసం నరబలి ఇచ్చినట్టుగా భావించిన పోలీసులు, ఈ కేసులో నిందితులు మృతుల శరీరభాగాలను వండుకుని తిన్నట్టు ఆ తర్వాత గుర్తించారు. 

తాజాగా, ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులు శరీర భాగాలతో కూడిన 61 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 56 ప్యాకెట్లు ఓ గుంతలో కనుగొన్నారు. మిగతావి మరో గుంత నుంచి వెలికి తీశారు. మృతులను రోస్లీ (49), పద్మం (52)గా గుర్తించారు. రోస్లీ కేరళకు చెందిన మహిళ కాగా, పద్మం తమిళనాడుకు చెందిన మహిళ. 

ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్ షఫీ నేర చరిత్ర, అతడి స్వభావం తెలుసుకుని పోలీసులే విస్తుపోయారు. మహ్మద్ షఫీ... భగవల్ సింగ్, లైలా అనే దంపతులను క్షుద్రపూజలు, సంపద పేరిట ఆకట్టుకుని, వారి సాయంతోనే తాజా హత్యలు చేసినట్టు వెల్లడైంది. 

షఫీ ఓ సైకో అని, కామ పిశాచి అని పోలీసులు వెల్లడించారు. పైశాచిక ఆనందం కోసం హత్యలు చేయడం అతడికి అలవాటు అని పేర్కొన్నారు. 6వ తరగతితో చదువు ఆపేశాడని, ఇంటి నుంచి వెళ్లిపోయి హోటల్లో వెయిటర్ గా, ట్రక్ డ్రైవర్ గా, మెకానిక్ గా పనిచేసి చివరికి ఎర్నాకుళంలో స్థిరపడ్డాడని తెలిపారు. 

అతడికి దశాబ్ద కాలానికి పైగా నేర చరిత్ర ఉందని, 10 కేసుల్లో నిందితుడని కేరళ ఐజీపీ సీహెచ్ నాగరాజు పేర్కొన్నారు. వాటిలో అత్యాచారం, దొంగతనం, హత్యాయత్నం కేసులు ఉన్నాయని వివరించారు. 

తాజాగా ఇద్దరు మహిళలను హత్యచేసి, వారి శరీర భాగాలను ఇతర నిందితులతో కలిసి వండుకుని తిన్నాడని తెలిపారు. తనతో శృంగారంలో పాల్గొంటే రూ.15 వేలు ఇస్తానని పద్మం అనే మహిళను తీసుకువచ్చి చిత్రహింసలు పెట్టి చంపాడని, మరో మహిళ రోస్లీని పోర్న్ ఫిలింలో నటిస్తే రూ.10 లక్షలు ఇస్తానని చెప్పి తీసుకువచ్చాడని, ఆమెను కూడా దారుణరీతిలో చంపేసి శరీరభాగాలను కోసివేశాడని, అతడికి భగవల్ సింగ్, లైలా సహకరించారని ఐజీపీ నాగరాజు వెల్లడించారు. 

కాగా, ఈ హత్యకేసులో నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వీరికి న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. కాగా, మహ్మద్ షఫీ భార్య దీనిపై స్పందిస్తూ, తన భర్త ఇంతటి దారుణ అఘాయిత్యాలకు పాల్పడ్డాడంటే తాను నమ్మబోనని పేర్కొంది. తమ పెళ్లయి 24 ఏళ్లయిందని, తన భర్త మంచివాడని చెబుతోంది.

More Telugu News