KTR: ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడు అయితే దేశ సంపద పెరగదు: కేటీఆర్

  • గుజరాత్ కు గత ఐదు నెలల్లో రూ. 80 వేల కోట్లు ఇచ్చారన్న కేటీఆర్
  • తెలంగాణకు కనీసం రూ. 18 వేల కోట్లు ఇవ్వలేరా? అని ప్రశ్న
  • నల్గొండకు రూ. 18 వేల కోట్లు ప్రకటిస్తే మునుగోడు పోటీ నుంచి తప్పుకుంటామని వ్యాఖ్య
KTR comments on Modi

దేశ ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడు అయినంత మాత్రాన దేశ సంపద పెరగదని... మరొక వ్యక్తికి కాంట్రాక్టు ఇచ్చినంత మాత్రాన జిల్లా బాగుపడదని అన్నారు. అదానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల పేర్లను ప్రస్తావించకుండా ఆయన ఈ మేరకు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తమకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదు... నల్గొండ ప్రయోజనాలే ముఖ్యం మోదీ గారూ అని ట్వీట్ చేశారు. గుజరాత్ కు గత ఐదు నెలల్లో రూ. 80 వేల కోట్ల ప్యాకేజీలు ఇచ్చారని... మా తెలంగాణకు కనీసం రూ. 18 వేల కోట్లు ఇవ్వలేరా? అని ప్రశ్నించారు. 

ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం మిషన్ భగీరథకి రూ. 19 వేల కోట్లను కేటాయించమని నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే పెడచెవిన పెట్టారని కేటీఆర్ విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వ్యక్తికి రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టును ఇచ్చారని విమర్శించారు. ఇప్పటికైనా మోదీ గారు నల్గొండ జిల్లాకు రూ. 18 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటిస్తే మునుగోడు పోటీ నుంచి తప్పుకుంటామని... దీనికి బీజేపీ సిద్ధమా? అని ప్రశ్నించారు.

More Telugu News