KTR: కేసీఆర్ నల్లపిల్లితో క్షుద్రపూజలు చేస్తాడన్న బండి సంజయ్... ఎర్రగడ్డలో బెడ్ ఖాళీగా ఉందన్న కేటీఆర్

  • బీఆర్ఎస్ వెనుక తాంత్రికుడి సలహా ఉందన్న బండి సంజయ్
  • మూడు నెలలకోసారి తాంత్రిక పూజలు చేస్తాడని వెల్లడి
  • లవంగం గారిని ఇలాగే వదిలేయొద్దన్న కేటీఆర్
  • త్వరలోనే కరుస్తాడని సెటైర్
KTR replies to Bandi Sanjay remarks on CM KCR

సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో తాంత్రిక పూజలు చేస్తాడని, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ మార్చడం వెనుక ఓ తాంత్రికుడి సలహా ఉందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వెల్లడించడం తెలిసిందే. 

కేసీఆర్ ఫాంహౌస్ లో ప్రతి మూడు నెలలకోసారి నల్లపిల్లితో పూజలు చేస్తాడని, గతంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో ఫాంహౌస్ లో మృతి చెందితే, ఆ కేసు ఏమైందో కూడా తెలియదని అన్నారు. ఎన్ని క్షుద్రపూజలు చేసినా పరిస్థితి మారకపోవడంతో తాంత్రికుడి సూచన మేరకే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాడని బండి సంజయ్ పేర్కొన్నారు. 

బండి సంజయ్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఈ లవంగం గారిని ఇలాగే వదిలేయకండిరా బీజేపీ బాబులూ అంటూ వ్యాఖ్యానించారు. పిచ్చి ముదిరి త్వరలో కరవడం మొదలుపెడతాడేమో అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

మతిలేని మాటలతో సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాడని కేటీఆర్ విమర్శించారు. ఎర్రగడ్డలో బెడ్ తయారుగా ఉంది... తొందరగా తీసుకెళ్లి వైద్యం చేయించుకోండి అంటూ సెటైర్ వేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా కేటీఆర్ పంచుకున్నారు.

More Telugu News