USA: అమెరికాలో సిక్కు కుటుంబం దారుణ హ‌త్య‌

  • మృతుల్లో 8 నెల‌ల చిన్నారి, త‌ల్లిదండ్రులు
  • సోమ‌వారం వీరితోపాటు మ‌రో వ్య‌క్తిని కిడ్నాప్ చేసిన దుండ‌గుడు
  • పోలీసు క‌స్ట‌డీలో నిందితుడి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం
Four of Sikh family murdered in California by convicted criminal

ఎనిమిది నెల‌ల చిన్నారి స‌హా  అమెరికాలో కిడ్నాప్ అయిన‌ న‌లుగురు భారతీయులు హ‌త్య‌కు గుర‌య్యారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో గ‌త సోమ‌వారం అప‌హ‌ర‌ణ‌కు గురైన ఈ న‌లుగురూ ఓ తోట‌లో విగ‌త జీవులుగా క‌నిపించారు. ఈ విష‌యాన్ని స్థానిక పోలీసులు వెల్ల‌డించారు. వీళ్లంతా భార‌త సిక్కు కుటుంబానికి చెందిన వాళ్లు. మృతుల‌ను కాలిఫోర్నియాలోని మెర్సిడెస్ కౌంటీలో నివాసముంటున్న భారత సంతతికి చెందిన జస్దీప్ సింగ్ (36) అత‌ని భార్య జ‌స్లీన్ కౌర్ (27), వారి పాప ఆరూహి దేహి (8 నెల‌లు), స‌మీప బంధువు అమ‌న్ దీప్ సింగ్ (39)గా గుర్తించారు. జ‌స్దీప్ కుటుంబం కొన్ని రోజుల కింద‌ట ట్రక్కుల రవాణా వ్యాపారం ప్రారంభించింది. సోమవారం ఉదయం ఈ న‌లుగురూ త‌మ కార్యాలయానికి వెళ్లిన తర్వాత ఓ గుర్తుతెలియని దుండగుడు తుపాకీతో బెదిరించి ఈ నలుగురినీ ఓ ట్రక్కులో ఎక్కించుకొని కిడ్నాప్ చేశాడు.  

విష‌యం తెలుసుకున్న పోలీసులు  కార్యాలయంలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. కిడ్నాప్ అయిన వారిలో ఒకరి బ్యాంకు కార్డును మంగళవారం ఉదయం దుండగుడు స్థానిక ఏటీఎంలో ఉపయోగించినట్లు గుర్తించారు. అక్కడి సీసీ పుటేజీ ఆధారంగా మాన్వేల్‌ సాల్గాడో (48) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అత‌నే ఈ న‌లుగురినీ హ‌త్య చేసిన‌ట్టు పోలీసులు భావిస్తున్నారు.  ఈ దురాఘ‌తానికి కార‌ణం మాత్రం ఇంకా వెల్ల‌డి కాలేదు. అయితే, ఆర్థిక లావాదేవీలే కార‌ణం అయి ఉండొచ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు. కాగా, పోలీసుల కస్టడీలో ఉన్న సాల్గాడో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. సాల్గాడో పేరు మోసిన నేర‌గాడు. 2005 నాటి ఆయుధాల దోపిడీ కేసులో ఇతను 11 ఏళ్ల జైలుశిక్ష అనుభవించాడు.

More Telugu News