Sajjala Ramakrishna Reddy: కొత్త పార్టీల రాకపై విశ్లేషించబోము: సజ్జల రామకృష్ణారెడ్డి

  • బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్
  • కొత్త పార్టీలు వస్తే మంచిదన్న సజ్జల
  • పోటీతత్వంతో పనితీరు మెరుగవుతుందని వెల్లడి
  • అంతకుమించి లోతుగా ఆలోచించబోమని స్పష్టీకరణ
Sajjala opines on new parties

తెలంగాణ సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఏర్పాటు చేయడంపై వైసీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ప్రజలకు మేలు జరిగేలా విధానపరమైన అంశాలతో కొత్త పార్టీలు వస్తే మంచిదేనని అభిప్రాయపడ్డారు. 

ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీల ఏర్పాటును స్వాగతిస్తామని తెలిపారు. అయితే కొత్త పార్టీల వల్ల పోటీతత్వం పెరిగి పనితీరును మరింత మెరుగుపర్చుకునేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. అంతకుమించి కొత్త పార్టీలపై తాము లోతుగా ఆలోచించబోమని సజ్జల స్పష్టం చేశారు.

పక్క రాష్ట్రాల గురించి తమకు అనవసరం అని ఉద్ఘాటించారు. ఇటీవల కొందరు తెలంగాణ నేతలు మాట్లాడడం వల్లే తాము స్పందించాల్సి వచ్చిందని అన్నారు. తాము ఏపీ వ్యవహారాలకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. 

తమ పార్టీ రాజకీయం కోసం ఎత్తుగడలు వేసే పార్టీ కాదని, ప్రతి విషయంలోనూ పారదర్శకతను పాటిస్తున్నామని, అందుకే తమ పార్టీని ప్రజలు ఆదరించి సొంతం చేసుకున్నారని సజ్జల వివరించారు. అయితే తాము ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదని, అందరూ బాగుండాలన్నదే తమ అభిమతం అని తెలిపారు. వైసీపీ సిద్ధాంతం ఇదేనని పేర్కొన్నారు.

సజ్జల అటు విపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రజలు నష్టపోయేలా చేశారని ఆరోపించారు. చేయలేరని తెలిసి కూడా చంద్రబాబు హామీలు ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. తాము మేనిఫెస్టోలో చెప్పిన అంశాల్లో 98 శాతం హామీలను నెరవేర్చామని సజ్జల వెల్లడించారు. ఎన్నికల ముందు ఇచ్చే హామీలు పవిత్రంగా ఉండాలని అభిలషించారు.

More Telugu News