Botsa Satyanarayana: కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై బొత్స స్పందన

  • ఏపీలో ఉన్న వివిధ పార్టీల్లో ఒక పార్టీగా బీఆర్ఎస్ ఉంటుందన్న బొత్స
  • ఎన్ని పార్టీలు ఉంటే వైసీపీకి అంత మేలని వ్యాఖ్య
  • మూడు రాజధానులే తమ వైఖరి అన్న బొత్స
Botsa response on KCRs BRS

బీఆర్ఎస్ పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో విజయవాడలో కేసీఆర్ భారీ బహిరంగసభను ఏర్పాటు చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పై ఏపీలో సైతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ బీఆర్ఎస్ గురించి మాట్లాడుతూ... ఏపీలో ఉన్న వివిధ పార్టీల మాదిరే బీఆర్ఎస్ కూడా ఒక పార్టీగా ఉంటుందని చెప్పారు. ఏపీలో ఎన్ని పార్టీలు ఉంటే వైసీపీకి అంత మంచిదని అన్నారు. 

ఇదే సమయంలో అమరావతి రైతుల పాదయాత్రపై ఆయన విమర్శలు గుప్పించారు. ఎవరి కోసం ఈ పాదయాత్ర చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతలు, రియలెస్టేట్ వ్యాపారుల కోసం పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. మూడు రాజధానులే తమ ప్రభుత్వ వైఖరి అని చెప్పారు. ఉత్తరాంధ్రకు గత టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీతో చర్చకు సిద్ధమని అన్నారు.

More Telugu News