Indonesia: ఇండోనేషియాలో విషాదం: ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో తొక్కిసలాట.. 127 మంది మృతి

  • తూర్పు జావా ప్రావిన్సులోని మలాంగ్‌లో ఘటన
  • మైదానంలోకి దూసుకెళ్లిన ఓడిన జట్టు అభిమానులు
  • అదుపు చేసేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
  • తొక్కిసలాటలో మరో180 మందికి గాయాలు
127 Killed In Indonesia Stampede After Football Fans Invade Pitch

ఇండోనేషియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తూర్పు జావా ప్రావిన్సులోని ఫుట్‌బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 127 మంది ప్రాణాలు కోల్పోయారు. 180 మంది తీవ్రంగా గాయపడ్డారు. అరేమా ఫుట్‌బాల్ క్లబ్-పెర్సెబయ సురబయ మధ్య గతరాత్రి జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ఇండోనేషియా పోలీసులు తెలిపారు. ఓడిపోయిన జట్టు అభిమానులు ఒక్కసారిగా మైదానంలోకి దూసుకురావడంతో ఈ ఘటన జరిగింది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇది తొక్కిసలాటకు దారితీసింది.  

మలాంగ్‌లో జరిగిన ఈ ఫుట్‌బాల్ మ్యాచ్ అనంతరం అభిమానులు మైదానంలోకి చొచ్చుకెళ్తున్న వీడియోలు, ఫొటోలను స్థానిక మీడియా చానళ్లు ప్రసారం చేశాయి. కాగా, ఈ మ్యాచ్‌లో పెర్సెబయ 3-2తో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం జరిగిన తొక్కిసలాటతో ఇండోనేషియాలోని ప్రముఖ లీగ్ అయిన బీఆర్ఐ లీగ్ 1.. వారం రోజులపాటు మ్యాచ్‌లను నిషేధించింది. మరోవైపు, ఈ తొక్కిసలాట ఘటనపై ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండోనేషియా (పీఎస్ఎస్ఐ) విచారణకు ఆదేశించింది. కాగా, ఇండోనేషియాలో ఇలాంటి ఘటనలు ఇటీవల సర్వసాధారణంగా మారిపోయాయి.

More Telugu News