India: భార‌త్‌లో 5జీ సేవ‌లు ప్రారంభం.. నాలుగు న‌గ‌రాల్లోనే అందుబాటులోకి

  • ఢిల్లీలో ప్రారంభించిన‌ ప్రధాని నరేంద్ర మోదీ 
  • ఈ నెల‌లో 4 న‌గ‌రాల్లో సేవ‌లు అందుబాటులోకి తేనున్న‌ జియో 5జీ
  • దేశం మొత్తం రావడ‌నికి రెండేళ్లు ప‌ట్టే అవ‌కాశం 
5G launch in India when will Reliance Jio users get to use 5G on their phone

భార‌త్‌లో 5జీ సేవ‌లు శ‌నివారం మొద‌ల‌య్యాయి. ఢిల్లీలో జ‌రుగుతున్న‌ ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సేవ‌ల‌ను అధికారికంగా ప్రారంభించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈనెల 4వ తేదీ వరకు కొనసాగుతుంది. దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం (డాట్), సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) కలసి నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో జ‌రిగిన 5జీ స్పెక్ట్రమ్ వేలంలో ఒక‌టిన్న‌ర‌ లక్షల కోట్ల రూపాయల మొత్తం బిడ్లను డాట్ అందుకుంది. స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ జియో, అదానీ గ్రూప్, భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్, వొడాఫోన్ ఐడియాలు పాల్గొన్నాయి. అదానీ గ్రూప్‌‌ తన సొంత అవసరాల కోసం స్పెక్ర్టమ్ ను కొన్నది.  

రిలయన్స్ జియో, ఎయిర్‌‌‌‌‌‌‌ టెల్, వీఐ ద్వారా 5జీ సేవలు ఢిల్లీ, ముంబైతో సహా ఏడు నగరాల్లో అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. అయితే, ఇందుకు కొంత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. రిలయన్స్ జియో ఇప్పటికే జియో 5జీ సర్వీస్ ను ద‌శ‌ల వారీగా అందించాల‌ని త‌మ వార్షిక సర్వసభ్య సమావేశంలో నిర్ణ‌యించింది. ఈ దీపావళి నాటికి నాలుగు ప్ర‌ధాన న‌గ‌రాలు.. ఢిల్లీ, కోల్‌క‌తా, చెన్నై, ముంబైలో 5జీ సేవలను ప్రారంభించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. అంటే ఈ నెల‌ఖ‌రు వ‌ర‌కు ఈ న‌గరాల్లో 5జీ నెట్‌వ‌ర్క్ అందుబాటులోకి వ‌స్తుంది. 

దేశంలోని ఇత‌ర ప్రాంతాల్లో జియో 5జీ సేవలు పొందాలంటే వ‌చ్చే ఏడాది వ‌రకు వేచి చూడాల్సి ఉంటుంది. కాబ‌ట్టి 5జీ సేవ‌లు ఈ రోజే మొద‌లైనా.. అంద‌రూ దాన్ని ఉప‌యోగించడం కుద‌ర‌దు. తెలుగు రాష్ట్రాల్లో 5జీ ఇప్పుడే మొద‌ల‌య్యే అవ‌కాశం లేదు. వాస్తవానికి ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై న‌గ‌రాల్లో కూడా దీపావ‌ళి నాటికి కొన్ని ప్రాంతాల్లోనే జియో 5జీ సేవ‌లు అందుబాటులో ఉంటాయి. ఢిల్లీ విమానాశ్రయం మూడో టెర్మినల్‌లో ఇప్పుడు సేవలకు 5జీ సిద్ధంగా ఉంది. అక్క‌డి ప్రయాణికులు 20 రెట్ల వేగవంతమైన కనెక్టివిటీని పొందుతారు. 5జీ సేవలు ప్రారంభించిన తర్వాత రెండు, మూడేళ్ల‌లో దేశంలోని ప్రతి ప్రాంతానికి ఈ సేవలను అందుబాటులోకి తెస్తామ‌ని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల ప్రకటించారు.

More Telugu News