Arvind Kejriwal: కేజ్రీవాల్‌ను ఇంటికి పిలిచి భోజనం పెట్టిన ఆటోడ్రైవర్ షాకింగ్ కామెంట్స్.. తన ఓటు బీజేపీకేనని స్పష్టీకరణ

  • కేజ్రీవాల్‌ను ఇంటికి ఆహ్వానించి అందరి దృష్టిని ఆకర్షించిన విక్రమ్ దంతాని
  • నిన్న ప్రధాని కార్యక్రమానికి బీజేపీ బ్యాడ్జ్‌తో హాజరు
  • తాను నిజానికి బీజేపీ అభిమానినని చెప్పుకొచ్చిన విక్రమ్
  • తనకు ఏ ఆపద వచ్చినా ఆదుకునేది బీజేపీ కార్యకర్తలేనన్న వైనం
Rickshaw driver who hosted Arvind Kejriwal for dinner attends PM Modis rally and says he is a BJP voter and a Modi fan

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఇంటికి పిలిచి భోజనం పెట్టిన ఆటో డ్రైవర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయనను అతిథిగా మాత్రమే తన ఇంటికి పిలిచానన్న ఈ గుజరాత్ వాసి వచ్చే ఎన్నికల్లో తన ఓటు మాత్రం బీజేపీకేనని స్పష్టం చేశాడు. తాను చాలాకాలం నుంచి బీజేపీని అభిమానిస్తున్నట్టు చెప్పాడు. 

గత నెల 12న అహ్మదాబాద్‌లో నిర్వహించిన ‘ఆప్’ సమావేశానికి విక్రమ్ దంతాని తోటి ఆటో డ్రైవర్లతో కలిసి వెళ్లాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌కు తాను వీరాభిమానినని పేర్కొన్నాడు. కేజ్రీవాల్ తన ఇంటికి భోజనానికి రావాలని ఆహ్వానించాడు. అది విన్న కేజ్రీవాల్ సరేనంటూ అంగీకారం తెలిపారు. ఆ తర్వాత ఆయన భోజనానికి వెళ్లారు. అప్పట్లో ఈ వార్త సంచలనమైంది. 

కేజ్రీవాల్‌ను ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టిన విక్రమ్ దంతాని నిన్న అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్న కార్యక్రమంలో బీజేపీ బ్యాడ్జ్‌తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అది చూసిన మీడియా ‘ఇదేంటని’ ప్రశ్నించింది. స్పందించిన విక్రమ్.. తాను నిజానికి బీజేపీ అభిమానినని పేర్కొన్నాడు. రానున్న ఎన్నికల్లో తన ఓటు బీజేపీకేనని స్పష్టం చేశాడు. కేజ్రీవాల్‌ను ఓ అతిథిగానే ఇంటికి ఆహ్వానించానని చెప్పుకొచ్చాడు. కేజ్రీవాల్‌తో భేటీ తర్వాత ఆప్ నాయకులెవరూ తనను కలవలేదన్న ఆయన.. తనకు ఏ ఆపద వచ్చినా ఆదుకునేది బీజేపీ కార్యకర్తలేనని వివరించాడు. ఇప్పుడాయన వ్యాఖ్యలు ‘టాక్ ఆఫ్ ద టౌన్’ అయ్యాయి.

More Telugu News