Vanishree: 11 ఏళ్ల క్రితం కబ్జాకు గురైన సినీ నటి వాణిశ్రీ స్థలం.. తిరిగి అప్పగించిన సీఎం స్టాలిన్

  • నకిలీ పత్రాల ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న భూములను రద్దు చేసే అధికారం తీసుకొచ్చిన స్టాలిన్
  • మొత్తం ఐదుగురి భూములను కబ్జాదారుల చెర నుంచి విడిపించిన ప్రభుత్వం
  • స్టాలిన్ చల్లగా ఉండాలన్న వాణిశ్రీ
Senior Actress Vanishree gets back land that she lost 11 years back

అప్పుడెప్పుడో కబ్జాకు గురైన తెలుగు, తమిళ సీనియర్ నటి వాణిశ్రీ భూమి తిరిగి ఆమె సొంతమైంది. దాదాపు రూ. 20 కోట్ల విలువైన ఈ భూమిని కొందరు నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకోగా, దానిని రద్దు చేసిన స్టాలిన్ ప్రభుత్వం నిన్న ఆ భూమిని తిరిగి వాణిశ్రీకి అందించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా భూమి పత్రాలను ఆమెకు అందించారు. మొత్తం ఐదుగురి భూములను కబ్జాదారుల చెర నుంచి విడిపించి వాటిని తిరిగి యజమానులకు అందించారు. అందులో వాణిశ్రీ ఒకరు.

భూమి పత్రాలను తీసుకునేందుకు సచివాలయానికి వచ్చిన వాణిశ్రీ మాట్లాడుతూ.. రూ. 20 కోట్ల విలువైన తన భూమిని నకిలీ పత్రాలతో కబ్జా చేశారన్న విషయం తెలిసి తన ఆస్తి పోయిందనే అనుకున్నానని, ఆశలు వదిలేసుకున్నానని అన్నారు. అయితే, గతేడాది నకిలీ పత్రాల ద్వారా జరిగిన భూ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారాన్ని తీసుకొచ్చి తన భూమిని తనకు ఇప్పించినందుకు సీఎం స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తాను 11 ఏళ్లుగా తిరిగి తిరిగి అలసిపోయానని, ఇకపై పైసా కూడా ఖర్చు పెట్టకూడదని అనుకున్న సమయంలో ముఖ్యమంత్రి కల్పించుకుని తన భూమిని తిరిగి ఇప్పించారని పేర్కొన్నారు. ఆయన చల్లగా ఉండాలని, మంచి పాలన అందిస్తూనే ఉండాలని ఆకాంక్షించారు.

More Telugu News