Market crash: కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు

  • సెన్సెక్స్ సుమారు వెయ్యి పాయింట్ల పతనం
  • నిఫ్టీ సుమారు 300 పాయింట్లకు పైగా నష్టం
  • ప్రతికూలంగా అంతర్జాతీయ సంకేతాలు
  • ఆర్థిక మాంద్యంపై పెరిగిన భయాలు
Market crash leaves investors poorer by Rs 7 lakh crore

అంతర్జాతీయ సంకేతాలు భారత ఈక్విటీ మార్కెట్లలో అలజడిని సృష్టించాయి. వరుసగా నాలుగో రోజు సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ట్రేడవుతోంది. నిఫ్టీ ఏకంగా 312 పాయింట్లు నష్టపోయి 17,015 స్థాయిలో, సెన్సెక్స్ 970 పాయింట్లు తగ్గి 57,129 వద్ద చలిస్తున్నాయి. ఈ రోజు ఈక్విటీల పతనం వల్ల ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ రూ.7 లక్షల కోట్ల మేర క్షీణించింది. అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ అయితే ఏకంగా 4 శాతం పడిపోయింది. మార్కెట్లలో భారీ నష్టాలకు దారితీసిన కారణాలను పరిశీలించినట్టయితే.. 

యూఎస్ బాండ్ ఈల్డ్స్ రెండేళ్ల కాల వ్యవధి కలిగినవి మూడేళ్ల గరిష్ఠానికి చేరాయి. 1.3 శాతం పెరిగి 4.26 శాతానికి చేరాయి. పదేళ్ల భారత్ బాండ్ ఈల్డ్స్ సైతం 7.41 శాతానికి చేరాయి. గత శుక్రవారం యూఎస్ డౌజోన్స్ సూచీ 2020 నవంబర్ తర్వాత కనిష్ఠ స్థాయిలో క్లోజ్ అయింది. ఒక విధంగా చెప్పాలంటే అమెరికా, యూరోప్ మార్కెట్లు బేరిష్ దశలోకి వెళ్లిపోయాయి. 

యూఎస్ ఫెడ్ దూకుడుగా రేట్లను పెంచుకుంటూ వెళుతోంది. దీంతో మాంద్యం తథ్యమన్న అంచనాలు స్టాక్స్ అమ్మకాలకు ప్రేరణనిస్తున్నాయి. అంతర్జాతీయ సంకేతాలు అత్యంత ప్రతికూలంగా ఉండడం మన మార్కెట్లను షేక్ చేస్తోంది. నిజానికి ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంది. కానీ, స్టాక్స్ వ్యాల్యూషన్లు గరిష్ఠాల్లో ఉండడంతో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపిస్తున్నారు. ఇవన్నీ నష్టాలకు కారణాలుగా కనిపిస్తున్నాయి.

More Telugu News