TTD: తిరుమల వెంకన్నకు దేశవ్యాప్తంగా రూ.85 వేల కోట్ల విలువ చేసే ఆస్తులు

  • అత్యంత సంపన్న హిందూ పుణ్యక్షేత్రంగా తిరుమల
  • టీటీడీకి దేశవ్యాప్తంగా 960 ఆస్తులు
  • 7,123 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆస్తులు
  • వివరాలు తెలిపిన టీటీడీ చైర్మన్
TTD has assets countrywide

ప్రపంచంలో వాటికన్ తర్వాత అత్యంత సంపన్న పుణ్యక్షేత్రం తిరుమల. నిత్యం కోట్ల రూపాయల ఆర్జనతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అత్యంత ధనిక బోర్డుగా ఖ్యాతి పొందింది. 

టీటీడీకి దేశవ్యాప్తంగా 960 ఆస్తులు ఉన్నాయని, 7,123 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆ ఆస్తుల విలువ రూ.85,705 కోట్లు అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. 1974 నుంచి 2014 మధ్య వివిధ ప్రభుత్వాల హయాంలో టీటీడీ దేశవ్యాప్తంగా 113 ఆస్తులను వదులుకుందని వివరించారు. అయితే 2014 నుంచి ఇప్పటివరకు టీటీడీ ఏ ఒక్క ఆస్తిని కూడా వదులుకోలేదని వెల్లడించారు. 

తన నేతృత్వంలోని గత టీటీడీ బోర్డు క్రమం తప్పకుండా శ్వేతపత్రాలు విడుదల చేయాలన్న తీర్మానం చేసిందని వైవీ తెలిపారు. ఈ క్రమంలో గతేడాది తొలి శ్వేతపత్రం విడుదల చేశామని చెప్పారు. రెండో శ్వేతపత్రం వివరాలను కూడా టీటీడీ వెబ్ సైట్లోకి అప్ లోడ్ చేస్తున్నామని వివరించారు. 

భక్తుల మనోభావాలకు పెద్దపీట వేస్తూ ఆలయ ట్రస్టు ఆస్తులను పరిరక్షించే దిశగా పారదర్శకతతో వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. 

ప్రపంచ హిందూ దేవాలయాల్లో అత్యంత ధనిక బోర్డుగా కొనసాగుతున్న టీటీడీకి వివిధ జాతీయ బ్యాంకుల్లో రూ.14 వేల కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉన్నాయి. అంతేకాదు, 14 టన్నుల బంగారం నిల్వలు కూడా టీటీడీ సొంతం.

More Telugu News