Kakani Govardhan Reddy: ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీకి ప్రారంభోత్సవం చేయడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు: కాకాణి గోవర్ధన్

  • చంద్రబాబు నోరు విప్పితే అన్నీ అబద్ధాలే వస్తాయన్న మంత్రి 
  • తన హయాంలో ఎక్కువ మెడికల్ కాలేజీలు వచ్చాయని చంద్రబాబు చెపుతున్నారని విమర్శ 
  • బాబుకు చిత్తశుద్ధి ఉంటే టీడీపీని ఎన్టీఆర్ వారసులకు అప్పగించాలని డిమాండ్ 
Chandrababu is a liar says Kakani Govardhan Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు నోరు విప్పితే అన్నీ అబద్ధాలే వస్తాయని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విశేషమైన కృషి చేశారని... అందువల్ల హెల్త్ యూనివర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం సముచితమని చెప్పారు. దీనిపై చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

తన హయాంలోనే ఎక్కువ మెడికల్ కాలేజీలు వచ్చాయని చంద్రబాబు చెపుతున్నారని... నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీని తామే కట్టామని చెప్పారని... ఇది పూర్తిగా అవాస్తవమని కాకాణి అన్నారు. ఆ మెడికల్ కాలేజీకి 2013 ఏప్రిల్ 3న శంకుస్థాపన చేశారని... 2013 ఆగస్ట్ 24న ఏసీ సుబ్బారెడ్డి మెమోరియల్ మెడికల్ కాలేజీగా నామకరణం చేశారని చెప్పారు. ఆ కాలేజీకి ప్రారంభోత్సవం చేయడం మినహా చంద్రబాబు చేసిందేమీ లేదని తెలిపారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే టీడీపీని ఎన్టీఆర్ వారసులకు అప్పగించాలని మంత్రి డిమాండ్ చేశారు. 

More Telugu News