HCA: జింఖానా మైదానం వద్ద ఉద్రిక్తత.. గేట్లు తోసుకొని, గోడలు దూకి గ్రౌండ్​లోకి వేలాదిమంది క్రికెట్ అభిమానులు

  • భారత్-ఆసీస్ మ్యాచ్ టిక్కెట్ల కోసం చొచ్చుకొచ్చిన  యువకులు
  • హెచ్సీఏ కార్యాలయం చుట్టుముట్టిన అభిమానులు
  • కౌంటర్లలో టిక్కెట్లు అమ్మాలని డిమాండ్ చేస్తూ  ఆందోళన
Thosands gathered at gymkhana fir tickets

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25న భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగే మూడో టీ20 మ్యాచ్ టిక్కెట్ల కోసం అభిమానులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మ్యాచ్ టిక్కెట్ల కోసం వేలాది సంఖ్యలో యువకులు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ దగ్గరకు వచ్చారు. గేట్లకు తాళం వేయడంతో పాటు టిక్కెట్లు విక్రయించడం లేదని అక్కడి అధికారులు చెప్పడంతో వాళ్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 

అప్పటికే గంటల కొద్దీ నిరీక్షించిన యువకులు గేట్లు తోసుకొని, గోడలు దూకి జింఖానా క్రికెట్ మైదానంలోకి వచ్చారు. అక్కడి హెచ్సీఏ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. నాలుగైదు రోజులుగా తిరుగుతున్నా టిక్కెట్లు అమ్మడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పేటీఎం’ యాప్ లో టిక్కెట్లు అందుబాటులో లేవని, ఉన్నా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగా నేరుగా కౌంటర్లలో ఎందుకు అమ్మడం లేదని హైదరాబాద్ క్రికెట్ సంఘాన్ని ప్రశ్నిస్తున్నారు.

టిక్కెట్లను బ్లాక్ చేస్తున్నారని ఆరోపించారు. వీ వాంట్ టిక్కెట్స్..   హెచ్ సీఏ, సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తూ మైదానంలోకి వచ్చారు. హెచ్సీఏ కార్యాలయం పైకి కూడా ఎక్కారు. వేలాది మంది అభిమానులు గ్రౌండ్ లోపలికి చొచ్చుకు రావడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. కొంత మంది అభిమానులు జింఖానా క్రికెట్ గ్రౌండ్, ఔట్ ఫీల్డ్, పిచ్ పై కూర్చున్నారు. టిక్కెట్లు ఎప్పుడు ఇస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

అయితే, హెచ్సీఏ అధికారులు మాత్రం ఆన్ లైన్లోనే అందుబాటులో ఉన్నాయని, రేపు కౌంటర్లలో అమ్ముతామని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఫ్యాన్స్ వినడం లేదు. వందలు, వేల సంఖ్యలో యువకులు ఒక్క చోటుకు చేరడంతో జింఖానా, పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

More Telugu News