Arvind Kejriwal: నన్ను, నా పార్టీని వేధించేందుకు గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్ ఏకమయ్యాయి: కేజ్రీవాల్

  • వడోదర ఎయిర్ పోర్టుకు వచ్చిన కేజ్రీవాల్
  • కేజ్రీవాల్ ముందు మోదీ, మోదీ అంటూ నినాదాలు
  • మండిపడిన ఆప్ అధినేత
  • రాహుల్ గాంధీ వస్తే ఇలా చేయలేదే... అంటూ విమర్శలు
Kejriwal got anger Modi chants at Vadodara airport

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ గుజరాత్ లోని వడోదర ఎయిర్ పోర్టుకు చేరుకోగానే, బీజేపీ మద్దతుదారులు ఆయన ముందు మోదీ, మోదీ అంటూ నినాదాలు చేశారు. 

దాంతో, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేజ్రీవాల్... తనను, తన పార్టీని వేధించేందుకు గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్ ఏకం అయ్యాయని ఆరోపించారు. రాహుల్ గాంధీ గుజరాత్ లో పర్యటిస్తే, ఆయన ముందు బీజేపీ ఎప్పుడూ ఇలా నినాదాలు చేయలేదని వెల్లడించారు. తనకు వ్యతిరేకంగా బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర పన్నుతున్నాయని అన్నారు. 

ఈసారి గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి అసలు సిసలైన పోటీ ఎలా ఉంటుందో చూపిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పెనుసవాల్ తప్పదని హెచ్చరించారు. 

త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, కేజ్రీవాల్ ఆ రాష్ట్రంలో పర్యటిస్తూ ఓటర్లను తమవైపుకు తిప్పుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్ లో అధికారం చేజిక్కించుకున్న ఆప్... తదుపరి లక్ష్యం గుజరాతేనని కేజ్రీవాల్ మాటల ద్వారా తెలుస్తోంది.

More Telugu News