Cheeta: ఇప్పుడంటే విదేశాల నుంచి చీతాలను తెచ్చారు కానీ.. అప్పట్లో వీటిని కుక్కల్లా పెంచుకునేవారు. ఆశ్చర్యపోయే వీడియోలు ఇవిగో!

  • అప్పట్లో వేటకుక్కల్లా చీతాలను పెంచుకున్న వైనం
  • జింకలు, దుప్పులను వేటాడటానికి వినియోగించుకున్న స్థానికులు
  • రాజులు, బ్రిటిషర్లు విచ్చలవిడిగా వేటాడటంతో అంతరించిన చీతాలు
Cheetahs used to breed like dogs in india

ఒకప్పుడు మన దేశంలో పెద్ద సంఖ్యలో ఆసియన్‌ చీతాలు ఉండేవి. విచ్చలవిడి వేట, ఇతర కారణాలతో 70 ఏళ్ల క్రితమే అవి అంతరించిపోయాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం నమీబియా నుంచి ఎనిమిది చీతాలను తెచ్చి కునో నేషనల్‌ పార్క్‌లో వదలడం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ అత్యంత చిత్రమైన సంగతి ఏమిటంటే.. చీతాలు దాడికి దిగేవి అయినా, మాంసాహారులే అయినా ఒకప్పుడు వాటిని ఇళ్లలో పెంచుకునేవారు. అడవుల్లోకి వెళ్లినప్పుడు ఈ పెంపుడు చీతాలను వేటకుక్కల్లా వినియోగించేవారు. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) అధికారి పర్వీన్‌ కశ్వాన్‌ దీనికి సంబంధించి 1939 నాటి ‘వైల్డర్‌ నెస్‌ ఫిల్మ్స్‌ ఇండియా లిమిటెడ్‌’ తీసిన వీడియోలను ట్విట్టర్‌లో పెట్టారు.

ప్రశాంతంగా ఉండే జీవులు కావడంతో..

  • సాధారణంగా చీతాలు ప్రశాంతంగా ఉంటాయి. అనవసరంగా దాడి చేయవు. అందుకే మనుషులు వాటిని సులువుగా మచ్చిక చేసుకోగలిగారని పర్వీన్‌ కశ్వాన్‌ పేర్కొన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వంనాటి రికార్డులు, వివరాల ప్రకారం.. అప్పట్లో అడవుల్లోంచి చీతాలను పట్టుకుని వచ్చి పెంచుకునేవారు. వాటిని ఇళ్ల ముందు ఆవులు, మేకల్లా కట్టేసి ఉంచుకునేవారు. వన్యప్రాణుల వేట కోసం వినియోగించుకునేవారు.  
  • చీతాలను ఎడ్ల బండ్లపై జింకలు, దుప్పులు ఉన్న ప్రదేశాలకు తీసుకెళ్లేవారు. అయితే మధ్యలో ఇతర జంతువులను చూసినా, పెద్ద సంఖ్యలో మనుషులను చూసినా బెదిరి దాడి చేస్తాయన్న ఉద్దేశంతో వాటి కళ్లకు గంతలు కట్టేవారు. అడవిలోకి వెళ్లాక కళ్ల గంతలు విప్పి వన్యప్రాణులున్న వైపు వదిలేవారు.
  • అత్యంత వేగంగా పరుగెత్తే చీతాలు.. జింకలు, దుప్పులు వంటి జంతువులను వేటాడేవి. చీతాల యజమానులు ఆ జింకలు, దుప్పుల మాంసం తెచ్చుకునేవారు. అదే జంతువుల రక్తాన్ని, కొంత మాంసాన్ని చీతాలకు పెట్టేవారు. ఈ దృశ్యాలన్నీ కూడా వైల్డర్‌ నెస్‌ వీడియోలో ఉన్నాయి.
  • రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో ఇళ్ల ముందు పెంపుడు కుక్కల్లా చీతాలను కట్టేసిన చిత్రాన్ని కూడా పర్వీన్‌ పోస్ట్‌ చేశారు. బ్రిటన్‌కు చెందిన బయాలజిస్ట్‌, ఆర్టిస్ట్‌ అయిన మరియన్‌ నార్త్‌ 1878లో విడుదల చేసిన పుస్తకంలో ఆ పెయింటింగ్‌ ఉందని పేర్కొన్నారు.
  • బ్రిటన్‌కు చెందిన ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ రాజస్థాన్‌ లో జింకలను వేటాడడానికి పెంపుడు చీతాలను తీసుకెళ్తున్న ఫొటోను, ఛత్తీస్‌గఢ్‌లో కింగ్‌ ఆఫ్‌ కొరియా మూడు చీతాలను వేటాడి చంపిన ఫొటోను కూడా పర్వీన్‌ పోస్ట్‌ చేశారు.
  • భారత ప్రభుత్వం మన దేశంలో ఆసియన్‌ చీతాలు అంతరించిపోయినట్టు 1952లో అధికారికంగా ప్రకటించింది. 1972లో తొలిసారిగా వన్య ప్రాణుల సంరక్షణ చట్టాన్ని తెచ్చింది.
  • ప్రస్తుతం దేశంలో కొన్ని రకాల జంతువులు చీతాల్లా అంతరించిపోయే పరిస్థితిలో ఉన్నాయని.. వాటి సంరక్షణపై దృష్టిపెట్టకుంటే భవిష్యత్తులో వాటిని ఫొటోల్లోనే చూడాల్సి వస్తుందని పర్వీన్‌ కశ్వాన్‌ వ్యాఖ్యానించారు.

More Telugu News