TDP: జనవరి నుంచి లోకేశ్ పాదయాత్ర.. 450 రోజుల షెడ్యూల్‌తో రూట్‌మ్యాప్!

  • సంక్రాంతి తర్వాత పాదయాత్ర చేపట్టే యోచనలో లోకేశ్
  • అన్ని ప్రాంతాలను కలుపుతూ సాగనున్న యాత్ర
  • చిత్తూరులో ప్రారంభమై ఉత్తరాంధ్రలో ముగింపు
  • విభజిత ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిస్థాయిలో యాత్ర చేపట్టనున్న తొలి నేతగా లోకేశ్ 
  • 2024 మార్చిలో యాత్రకు ముగింపు
  • విశ్రాంతి లేకుండా కొనసాగనున్న యాత్ర
TDP leader Lokesh Ready To Begin Padayatra

టీడీపీ అగ్రనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. నిజానికి ఈ అక్టోబరు నుంచే పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించినప్పటికీ.. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొన్న తర్వాత చేపడితే బాగుంటుందన్న కారణంతో వచ్చే ఏడాది జనవరికి దానిని వాయిదా వేసినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే సంక్రాంతి పండుగ తర్వాత యాత్ర  ప్రారంభం అవుతుంది. 

మొత్తం 450 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. అంటే జనవరిలో ప్రారంభమై 2024 మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి యాత్ర ముగిసేలా రూట్‌మ్యాప్‌ను తీర్చిదిద్దుతున్నారు. చిత్తూరు జిల్లా నుంచి యాత్రను ప్రారంభించి ఉత్తరాంధ్రలో ముగించాలని లోకేశ్ ప్రాథమికంగా నిర్ణయించారని చెబుతున్నారు. అన్ని ప్రాంతాలను సందర్శించేలా రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని నిర్ణయించారు. అంతేకాదు, విరామం లేకుండా వారమంతా పర్యటన సాగించాలని లోకేశ్ యోచిస్తున్నట్టు చెబుతున్నారు. 

ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పాదయాత్ర చేపట్టి విజయం సాధించారు. ఇప్పుడు దీనినే లోకేశ్ కొనసాగించనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను కలుపుకుంటూ పాదయాత్ర చేసిన చివరి నేతగా చంద్రబాబు రికార్డులకెక్కారు. ఉమ్మడి రాష్ట్రంలోనే జగన్ కూడా పాదయాత్ర చేపట్టినప్పటికీ రాష్ట్రం విడిపోవడంతో ఆయన యాత్ర ఏపీకి మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర చేస్తున్న తొలి నేతగా లోకేశ్ రికార్డులకెక్కనున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా లోకేశ్ యాత్ర సాగనుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

More Telugu News