Parthasarathi: గుజరాత్ మోడల్ కాదు... ఇప్పుడు జగన్ మోడల్ గురించి దేశమంతా మాట్లాడుకుంటున్నారు: పార్థసారథి

  • రెండోరోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • ఆర్థికాభివృద్ధిపై స్వల్పకాలిక చర్చ
  • ప్రసంగించిన వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి
Parthasarathi speech in AP assembly

ఏపీ ఆర్థికాభివృద్ధిపై అసెంబ్లీ సమావేశాల్లో స్వల్ప కాలిక చర్చ నిర్వహించగా, వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తప్పుడు నివేదికలతో చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టాడని విమర్శించారు. గత ప్రభుత్వం ప్రచారానికి మాత్రమే పరిమితమైందని అన్నారు.

కానీ, పారిశ్రామికాభివృద్ధికి సీఎం జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న 500 రకాల సమస్యలను పరిష్కరించడం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. జగన్ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో జాతీయస్థాయిలో నెంబర్ వన్ గా వచ్చిందంటే, కేంద్రం నిర్దేశించిన అన్ని ప్రమాణాలను పాటిస్తున్నట్టేనని ఉద్ఘాటించారు. 

2018లో ఇలాంటి పరిస్థితి లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగానే ర్యాంకింగ్ ఇచ్చేవాళ్లని వెల్లడించారు. చంద్రబాబు నివేదికలు ఎలా ఉంటాయో మాకంటే మీకే బాగా తెలుసు అధ్యక్షా అంటూ స్పీకర్ తమ్మినేనిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అందుకు తమ్మినేని స్పందిస్తూ... "సారీ ఫర్ ద ఇంటరప్షన్... మీరు నన్ను సాక్ష్యంగా తీసుకువస్తున్నారు... నేను మాట్లాడితే చాలా వాస్తవాలు చెప్పాల్సి ఉంటుంది... కానీ ఇప్పుడు నేనున్న స్థానం నుంచి అవన్నీ మాట్లాడలేను" అంటూ నవ్వుతూ బదులిచ్చారు. 

అనంతరం, పార్థసారథి కొనసాగిస్తూ.... గత ప్రభుత్వం హయాంలో ప్రజలను ఎలా మోసం చేశారు అనే విషయాలను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అధ్యక్షా అంటూ వివరణ ఇచ్చారు. ఇవాళ గుజరాత్ ను కూడా తలదన్నేలా ఏపీ అభివృద్ధి పథంలో పయనిస్తోందని అన్నారు.

ప్రపంచమంతా గుజరాత్ మోడల్, గుజరాత్ మోడల్ అంటుంటారు... అలాంటిది, దేశంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మోడల్, జగన్ మోహన్ రెడ్డి మోడల్ అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితిని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది అని వివరించారు. 

డీపీఐఐటీ నివేదిక ప్రకారం... దేశం మొత్తమ్మీద ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు రూ.1.71 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే, ఒక్క ఏపీకే రూ.40,361 కోట్లు ఏపీకి పెట్టుబడుల రూపంలో వచ్చాయని, అంటే 25 శాతం పెట్టుబడులను రాష్ట్రం సాధించగలిగిందని వివరించారు.

More Telugu News