Chandrababu: సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చంద్రబాబు శుభవార్త!

  • వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇస్తానన్న చంద్రబాబు
  • ప్రజా సమస్యలపై వారి పోరాటమే వారిని గెలిపిస్తుందని ధీమా
  • జగన్ తన వైఫల్యాలను ఎమ్మెల్యేలపైకి నెట్టేయాలని చూస్తున్నారని ఎద్దేవా
Chandrababu says good news to sitting MLAs

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిన్న ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారందరికీ టికెట్లు ఖాయమని స్పష్టం చేశారు. ప్రజల్లో జగన్‌పై తీవ్ర వ్యతిరేకత వస్తోందని, తన వైఫల్యాలను ఎమ్మెల్యేలపైకి నెట్టేయాలని ఆయన చూస్తున్నారని విమర్శించారు.

వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు టికెట్ రాదని భయపడుతున్నారని, మరికొందరు వచ్చినా గెలవలేమని ఆందోళన చెందుతున్నారని అన్నారు. అయితే, టీడీపీ ఎమ్మెల్యేలకు ఆ భయం లేదన్నారు. ప్రజా సమస్యలపై ఇప్పుడు వారు చేస్తున్న పోరాటమే వారిని గెలిపిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.

 అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ సహా అందరి అమోదంతోనే రాజధానిగా అమరావతిని ఖరారు చేసినట్టు చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడాయన అమరావతిపై మడమ తిప్పారని ఎద్దేవా చేశారు. స్వార్థ రాజకీయాల కోసం జగన్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News