Telangana: రూ.15 వేల కోట్ల విలువ చేసే కూక‌ట్‌ప‌ల్లి భూముల వివాదంపై సుప్రీంకోర్టు కీల‌క తీర్పు

  • కూక‌ట్‌ప‌ల్లి వై జంక్ష‌న్‌లో ఉదాసీన్ ట్రస్టుకు 540 ఎక‌రాలు
  • గ‌ల్ఫ్ ఆయిల్ కార్పొరేష‌న్‌కు 99 ఏళ్ల‌కు లీజుకిచ్చిన ట్ర‌స్ట్‌
  • 538 ఎక‌రాల్లో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం మొద‌లుపెట్టిన కార్పొరేష‌న్‌
  • దేవాదాయ శాఖ ట్రైబ్యున‌ల్‌ను ఆశ్ర‌యించిన ట్ర‌స్టు
  • ట్రైబ్యున‌ల్ తీర్పును స‌మ‌ర్థిస్తూ తుది తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు
supreme court uphelds tribunal verdict in udaseen trust lands issue

హైద‌రాబాద్‌, కూక‌ట్‌ప‌ల్లి ప‌రిధిలోని రూ.15,000 కోట్ల విలువ చేసే 540 ఎక‌రాల భూ వివాదంపై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు బుధ‌వారం కీల‌క తీర్పు చెప్పింది. ఈ భూములు తెలంగాణ దేవా‌దాయ శాఖ ప‌రిధిలోని ఉదాసీన్ ట్ర‌స్టువేన‌ని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఏళ్ల త‌ర‌బ‌డి కోర్టుల్లో నానుతున్న ఈ భూముల వివాదానికి త‌న తీర్పు ద్వారా సుప్రీంకోర్టు ముగింపు ప‌లికింది.

కూక‌ట్‌ప‌ల్లి వై జంక్ష‌న్ స‌మీపంలోని ఉదాసీన్ మ‌ఠం త‌న ప‌రిధిలో ఉన్న 540 ఎక‌రాల భూముల‌ను 1964 నుంచి నాలుగు ద‌ఫాల్లో గ‌ల్ఫ్ అయిల్ కార్పొరేష‌న్‌కు 99 ఏళ్ల కాల ప‌రిమితితో లీజుకు ఇచ్చింది. బ‌ఫ‌ర్ జోన్‌లో ఉన్న‌ ఈ భూముల్లోని 538 ఎక‌రాల్లో గ‌ల్ఫ్ ఆయిల్ కార్పొరేష‌న్ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం మొద‌లు పెట్ట‌గా... ఆ కంపెనీ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ ఉదాసీన్ ట్ర‌స్టు దేవా‌దాయ శాఖ ట్రైబ్యున‌ల్‌ను ఆశ్ర‌యించింది. 

ట్రైబ్యున‌ల్‌లో ట్ర‌స్టుకు అనుకూలంగా తీర్పు రాగా... గల్ఫ్ అయిల్ కార్పొరేష‌న్ హైకోర్టును, ఆ త‌ర్వాత సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. ట్రైబ్యున‌ల్ తీర్పునే స‌మ‌ర్థించిన సుప్రీంకోర్టు... ఆ భూములు ఉదాసీన్ ట్ర‌స్టున‌కు చెందిన‌విగానే ప్ర‌క‌టించింది. ఈ తీర్పుపై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. దేవాదాయ శాఖ భూముల‌ను ర‌క్షించే దిశ‌గా ఆ శాఖ అధికారులు, న్యాయ‌వాదులు తీవ్రంగా కృషి చేశార‌ని ఆయ‌న అన్నారు.

More Telugu News