Andhra Pradesh: రాజ‌ధానులు ఎన్నైనా పెట్టుకోండి.. అమ‌రావ‌తిని అభివృద్ధి చేయండి: కేంద్ర మంత్రి నారాయ‌ణ స్వామి

  • 3 కాకుంటే 4 లేదా 5 రాజ‌ధానులు పెట్టుకోండ‌న్న నారాయ‌ణ స్వామి
  • అమ‌రావ‌తి అభివృద్ధిని మాత్రం ఆపొద్ద‌ని వ్యాఖ్య‌
  • అమ‌రావ‌తిని ఏపీ రాజ‌ధానిగా అంద‌రూ గుర్తించార‌న్న కేంద్ర మంత్రి
union minister narayana swamy comments on ap capital amaravati

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అభివృద్ధి, వైసీపీ ప్ర‌తిపాదిస్తున్న 3 రాజ‌ధానుల అంశంపై క‌ర్ణాట‌క‌కు చెందిన బీజేపీ నేత‌, కేంద్ర మంత్రి నారాయ‌ణ స్వామి బుధ‌వారం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అమ‌రావ‌తిని ఏపీ రాజ‌ధానిగా అంద‌రూ గుర్తించార‌ని ఆయ‌న పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల‌కు స‌మ దూరంలో ఉన్న అమ‌రావ‌తిలో అభివృద్ధి నిలిచిపోరాద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. అమ‌రావతితో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాలు కూడా అభివృద్ధి కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న అన్నారు.

ఈ సంద‌ర్భంగా వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదిస్తున్న 3 రాజ‌ధానుల అంశాన్ని ప్ర‌స్తావించిన నారాయ‌ణ స్వామి.. వైసీపీ ప్ర‌భుత్వం రాష్ట్రానికి 3 రాజ‌ధానులు.. లేదంటే 4 రాజ‌ధానులు, 5 రాజ‌ధానులు పెట్టుకున్నా ఇబ్బంది లేద‌ని, అయితే అమ‌రావ‌తి అభివృద్ధి మాత్రం ఆగిపోరాద‌ని ఆయ‌న పేర్కొన్నారు. రాజ‌ధాని అంశంపై వెలువ‌డుతున్న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు అమ‌రావతి అభివృద్ధికి ఆడ్డంకిగా మారుతున్నాయ‌ని కూడా ఆయ‌న అన్నారు. అమ‌రావ‌తిని గ‌త ఏపీ ప్ర‌భుత్వంతో పాటు కేంద్ర ప్ర‌భుత్వం కూడా గుర్తించిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు.

More Telugu News