Woman: పిజ్జా కోసం వేచి ఉంటూ లాటరీ టికెట్​ కొంటే.. రూ.40 లక్షల బహుమతి వచ్చింది!

  • ఇంటికి వెళ్తూ పిజ్జాలు తీసుకెళ్దామని రెస్టారెంట్ దగ్గర ఆగిన మహిళ
  • పిజ్జాలు తయారవడానికి కాస్త సమయం పడుతుందనడంతో అటూ ఇటూ తిరుగుతూ టైంపాస్
  • అక్కడ కనబడిన లాటరీ టికెట్లను సరదాగా కొనడంతో బహుమతి వచ్చిన వైనం
Woman won lottery while pizza run

అదృష్టం కలిసొస్తే.. ఏ మూలన కూర్చున్నా డబ్బులు వచ్చిపడతాయని అంటుంటారు. అమెరికాకు చెందిన ఓ మహిళకు అలాగే లక్షల రూపాయలు వచ్చి పడ్డాయి మరి. ఏదో టైం పాస్ కోసం చేసిన పని డబ్బులు కురిపించింది. 

అమెరికాలోని సౌత్ కరోలినాలో స్వాన్సియా ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. ఏదో పనిమీద బయటికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరుగుముఖం పట్టింది. ఫ్యామిలీ అంతా కలిసి తినేందుకు పిజ్జా తీసుకెళదామని భావించింది. స్వాన్సియాలోని రెయిన్ బో గ్యాస్ స్టేషన్ వద్ద రెస్టారెంటుకు వెళ్లి పిజ్జాలకు ఆర్డర్ చేసింది. 

అయితే, పిజ్జాలు రెడీ అవడానికి కాస్త సమయం పడుతుందని చెప్పడంతో కాసేపు ఆ ఆవరణలో తచ్చాడటం మొదలుపెట్టింది. అక్కడ సౌత్ కరొలినా ఎడ్యుకేషన్ లాటరీకి సంబంధించి టికెట్లను విక్రయించడం చూసింది. ఏదో సరదాకి ప్రయత్నిద్దామని రెండు డాలర్లు (సుమారు రూ.160) పెట్టి జంబో బక్స్ టికెట్లు కొనుగోలు చేసింది. 

అవి స్క్రాచ్ కార్డు టైప్ టికెట్లు. ముందుగానే లాటరీ ప్రైజ్ వచ్చే నంబర్లు ఎంపికై ఉంటాయి. టికెట్లను అప్పటికప్పుడు స్క్రాచ్ చేసి చూసుకుని.. ఆ నంబర్ ఉంటే బహుమతి తీసేసుకోవచ్చన్న మాట. అయితే సదరు మహిళ అప్పటికప్పుడే టికెట్లను స్క్రాచ్ చేయలేదు. పిజ్జాలు తీసుకుని ఇంటికి వెళ్లిపోయింది.

ఫ్యామిలీ అంతా కలిసి డిన్నర్ చేశాక.. టికెట్లను స్క్రాచ్ చేశారు. అందులో నంబర్లను, బహుమతి వచ్చే నంబర్లను సరిచూసుకుని ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే ఆ టికెట్ కు సుమారు రూ.40 లక్షలు (50 వేల డాలర్లు) లాటరీ తగిలింది. మొదట తన కుటుంబ సభ్యులు లాటరీ తగిలిందంటే నమ్మలేదని.. నంబర్లను ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని ఎగిరి గంతేశారని ఆమె చెప్పింది.

More Telugu News